రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలి
హైదరాబాద్ సిటీబ్యూరో/వికారాబాద్, జూన్ 14 (విజయక్రాంతి): ఆపదలో ఉన్నవారికి రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాని హైదరాబాద్ డీఎంహెచ్వో జే వెంకట్ అన్నారు. ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో సికింద్రాబాద్లోని డీఎంహెచ్వో కార్యాలయంలో గల సమావేశ మందిరంలో శుక్రవారం రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని డీఎంహెచ్వో ప్రారంభించి రక్తదానం చేశారు.కార్యక్రమంలో మలేరియా విభాగం అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ అమర్సింగ్, ఇన్చార్జ్ అడిషనల్ డీఎంహెచ్వో డాక్టర్ అనురాధ, వైద్యాధికారులు జక్కుల రాములు, సునీల్కుమార్, జీ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలి..
ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని వికారాబాద్ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పాల్వన్ కుమార్ అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఇప్పటికే 50 సార్లు రక్తదానం చేసిన మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ చిగుళ్లపల్లి రమేశ్తో పాటు పలువురు రక్తదాతలకు ప్రశంసా పత్రాలు అందజేశారు.






