20-11-2025 12:00:00 AM
-అధికారులకు ఎమ్మెల్యే బొజ్జు పటేల్ ఆదేశం...
-సమావేశానికిరాని అటవీ శాఖ అధికారులపై మంత్రికి ఫిర్యాదు
ఉట్నూర్, నవంబర్ 19 (విజయక్రాంతి): ఆదివాసీ గ్రామాల్లోనీ ఇబ్బందుల గురించి ఆయా గ్రామాల పటేల్లతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకొని అధికారులకు పరిష్కరించాలని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అధికారులను ఆదేశించారు. ఆదివాసీల సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉట్నూరు మం డలం లక్షేట్టి పేట్ గ్రామంలో 60 గ్రామాల పటేళ్ళు, రాయి సెంటర్ సార్మేడిలు, గ్రామస్తులతో కలిసి ఎమ్మెల్యే సమావేశం అయ్యారు.
ఈ సమావేశం లో మండలానికి చెందిన అన్ని శాఖల అధికారులు హాజరయ్యారు. ముఖ్యం గా గ్రామాలకు వెళ్లడానికి రోడ్లు, నీటి సమస్యలు, విద్యుత్ సమస్యలు, ఇతర సమస్యల గురించి చర్చించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుండి ప్రజాపాలనే ధ్యేయంగా ముందుకు వెళుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలో ఆదిలాబాద్ జిల్లాలో అనేక అబివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు జరిగి పనులు వేగంగా జరుగుతున్నాయనీ, ప్రభుత్వం అందజేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, రేషన్ కార్డుల పంపిణీ, ఉచిత బస్సు సౌకర్యం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళలకు స్వయం ఉపాధి ద్వారా లోన్స్, వివిధ అభివృద్ధి కార్యక్రమాల గురించి వారికి వివరించారు.
అధికా రులు ఎటువంటి ఇబ్బందులు కలగజేయకుండా ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను వెనువెంటనే పరిష్కరించే విధంగా చూడాలని ఎమ్మెల్యే సూచించారు. అలాగే అటవీశాఖ అధికారుల నిర్లక్ష్యం వలన చాలావరకు ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుపడడమే కాకుండా ఆదివాసుల పైన కేసులు పెట్టడం వలన ఆదివాసి ప్రజలు చాలా ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. ఈ సమావేశానికి అటవీశాఖ అధికా రులకు సమాచారం ఇచ్చినా గాని నిర్లక్ష్య ధోరణితో, ఎమ్మెల్యే మాటకు విలువ ఇవ్వకుండా అటవీ అధికారులు సమావేశానికి హాజరు కాలేదని, వారిపై తగిన చర్యలు తీసుకునే విధంగాపై అధికారులకు మంత్రికి ఫిర్యా దు చేస్తానని ఎమ్మెల్యే హెచ్చరించారు.