17-06-2025 01:11:04 AM
- 42 శాతం రిజర్వేషన్లు అమలు తర్వాతే ఎన్నికలకు వెళ్లాలి
- మంత్రి పొంగులేటి వ్యాఖ్యలను వ్యతిరేకిస్తున్నాం
- బీసీ నాయకులు జాజుల శ్రీనివాస్గౌడ్, చిరంజీవులు
హైదరాబాద్, జూన్ 16 (విజయక్రాంతి): బీసీ రిజర్వేషన్లపై రాష్ర్ట ప్రభుత్వం ఎలాంటి స్పష్టత ఇవ్వకుండానే స్థానిక సంస్థల ఎన్నికలపై తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం తగదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్, బీసీ మేథావుల ఫోరం చైర్మన్ టీ చిరంజీవులు అన్నారు.
మరో వారం పది రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ప్రకటించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. బీసీలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు వెళ్తే చేతులు కాల్చుకోక తప్పదని హెచ్చరించారు.
సోమవారం సచివాలయం మీడియా పాయింట్ వద్ద మీడియాతో జాజుల శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్లను 42 శాతం పెంచుతూ తెలంగాణ అసెంబ్లీలో చేసిన బిల్లు రాష్ర్టపతి వద్దకు చేరి రెండు నెలల పది రోజులు కావస్తున్నదన్నారు. ఇంకో మూడు వారాల్లో ఢిల్లీలో బీసీ రిజర్వేషన్ల బిల్లుపై స్పష్టత వస్తుందని, ఈ సమయంలో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికి సీఎం రేవంత్రెడ్డి అఖిలపక్షంతో ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోదీని కలవాలని డిమాండ్ చేశారు.
బీసీ రిజర్వేషన్లు 42 శాతం పెంచుతూ చర్యలు తీసుకోకుండా స్థానిక ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ రిజర్వేషన్లు పెంచడానికి సీఎం రేవంత్రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్ అనుకూలంగా ఉన్నప్పటికీ కొద్దిమంది అగ్రకుల మంత్రులు, ఉన్నతాధికారులు రాష్ర్ట ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని, ఈ వైఖరి మార్చుకోవాలని హెచ్చరించారు.
రాష్ర్ట ప్రభుత్వం తక్షణమే బీసీ రిజర్వేషన్లపై బీసీ సంఘాలు మేధావులు, న్యాయ నిపుణులు, అఖిలపక్ష పార్టీలతో సమావేశం ఏర్పాటు చేయాలని, ఆ తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలపై నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ర్ట వ్యాప్త ఉద్యమాన్ని చేపడుతామని హెచ్చరించారు. మంగళవారం హైదరాబాదులో బీసీ సంఘాలు, మేధావులతో అత్యవసర సమావేశం ఏర్పాటుచేసి ఉద్యమ కార్యచరణ ప్రకటిస్తామని తెలిపారు. చిరంజీవులు మాట్లాడుతూ.. రాష్ర్ట ప్రభుత్వం స్థానిక ఎన్నికలపై తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా, బీసీలకు అన్యాయం జరగకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో బీసీ కుల సంఘాల నాయకులు కుందారం గణేష్ చారి, కుల్కచర్ల శ్రీనివాసు, విక్రమ్ గౌడ్, మని మంజరి, వేణు, సంధ్య, గౌతమి, విజయ పాల్గొన్నారు.