calender_icon.png 17 June, 2025 | 8:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జీహెఎంసీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత

17-06-2025 01:11:59 AM

  1. నగర సమస్యలపై బీజేపీ కార్పొరేటర్ల ఆందోళన
  2. అడ్డుకున్న పోలీసులు
  3. గేట్లు ఎక్కి లోపలికి చొచ్చుకెళ్లేందుకు యత్నం

హైదరాడాద్ సిటీ బ్యూరో, జూన్ 16 (విజయక్రాంతి): హైదరాబాద్ నగరంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ కార్పొరేటర్లు సోమవారం జీహెఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. జీహెఎంసీ కమిషనర్‌కు వినతిపత్రం సమర్పించేందుకు ప్రయత్నించిన కార్పొరేటర్లను పోలీసుల అడ్డుకోవడంతో నిరసన వ్యక్తం చేశారు.

వినతిపత్రం సమర్పించేందుకు 15 మంది కార్పొరేటర్లను మాత్రమే లోపలికి అనుమతిస్తామని పోలీసులు తెలపడంతో అందరినీ అనుమతించాలని బీజేపీ కార్పొరేటర్లు పట్టుబట్టారు. దీంతో పోలీసులు ప్రధాన గేట్లను మూసివేసి ఆందోళ నకారులను అడ్డుకున్నారు.

పోలీసులు అడ్డుకున్నప్పటికీ బీజేపీ కార్యకర్తలు గేట్లు ఎక్కి లోపలికి చొచ్చుకొని వెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో, ప్రధాన గేటు ముందు బైఠాయించి నగర సమస్యల పరిష్కారం కోరుతూ నినాదాలు చేశారు. ఈ ఆందోళనతో జీహెఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

బీజేపీ ధర్నాలు కిషన్‌రెడ్డి ఇంటి ముందు చేయాలి: మంత్రి పొన్నం 

జీహెఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద బీజేపీ కార్పొరేటర్ల ఆందోళనపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రంగా స్పందించారు. బీజేపీ నాయకులు, కార్పొరేటర్లు ధర్నాలు చేయాల్సింది జీహెఎంసీ కార్యాలయం ముందు కాదని, హైదరాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఇంటి ముందు ధర్నా చేయాలని సూచించారు. తాము కూడా ధర్నాకు వస్తామని చెప్పారు.

హైదరాబాద్ నగరం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ కేంద్రం నుంచి ఒక్క రూపాయి తేకుండా హైదరాబాద్ అభివృద్ధికి కిషన్‌రెడ్డి అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. జీహెఎంసీ అభివృద్ధికి, సమస్యల పరిష్కారానికి రాష్ర్ట ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు అన్ని చర్యలు తీసుకుంటున్నాం అని స్పష్టం చేశారు.