18-11-2025 02:10:44 PM
హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ఇంటిగ్రేటెడ్ డిజిటల్ ఎడ్యుకేషన్ అకాడమీ ఏర్పాటుకు కామన్వెల్త్ ఆఫ్ లెర్నింగ్ (COL)తో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ (BRAOU) అవగాహన ఒప్పందం (MOU) కుదుర్చుకుంది. ఈ అవగాహన ఒప్పందంతో బీఆర్ఎఓయు ప్రముఖ డిజిటల్ విశ్వవిద్యాలయంగా అభివృద్ధి చెందనుంది. బోధన, అభ్యాసం, పరిశోధనలను మెరుగుపరచడానికి ఐడీఈఏ (iDEA) అత్యాధునిక డిజిటల్ హబ్గా పనిచేస్తుంది. ఇక నుంచి టెక్నాలజీ ద్వారా విద్యార్థులకు నాణ్యమైన విద్యను బీఆర్ఎఓయు అందించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
తెలంగాణలో విద్యా ప్రమాణాలు పెంచడంతో పాటు వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలోని యూనివర్సిటీలను బలోపేతం చేయడంతో పాటు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీని ఒక నాలెడ్జ్ హబ్ గా తీర్చి దిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఓఎస్ అధ్యక్షుడు పీటర్ స్కాట్ కు ముఖ్యమంత్రి వివరించారు. ఈ సమావేశంలో కామన్వెల్త్ ఆఫ్ లెర్నింగ్ (COL) అధ్యక్షుడు & సీఈఓ పీటర్ స్కాట్ (Mr.Petor Scott), ప్రభుత్వ సలహాదారు కే.కేశవరావు, బీఆర్ఎఓయు వైస్ చాన్స్ లర్ ఘంటా చక్రపాణి, సిఎం స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
