శ్రీరామ నవమి ప్రత్యేక పూజలు నిర్వహించిన డాక్టర్ కోట నీలిమ
సనత్నగర్(విజయక్రాంతి): లోక కల్యాణం కోసం ఎన్నోత్యాగాలకోర్చిన సీతారాముల పవిత్ర బంధం అజరామరమైనదని, రాబోయే తరాలకు ఆదర్శనీయమైనదని పీసీసీ వైస్ ప్రెసిడెంట్, సనత్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి డాక్టర్ కోట నీలిమ అన్నారు. శ్రీరామ నవమి సందర్భంగా నియోజకవర్గంలోని అమీర్ పేట్ డివిజన్ హనుమాన్ దేవస్థానంలో సనత్ నగర్ డివిజన్ సెవెన్ టెంపుల్స్, జెక్ కాలనీలో సీతారామచంద్రులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ క్రమంలో ఆయా ఆలయాల ఈవోలు, పురోహితులు, అర్చక సిబ్బంది, నిర్వాహకులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కోట నీలిమ మాట్లాడుతూ.. శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలంతా శ్రీరామ నవమిని భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. నవమి రోజున ప్రతి ఏటా వైభవోపేతంగా శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని నిర్వహించుకుంటారన్నారు. శ్రీరాముడి జీవితం ప్రజాస్వామ్య పరిపాలనకు మార్గదర్శకమని, రాముడు తన పాలనలో ప్రజల ఆకాంక్షలకు ప్రాధాన్యత ఇచ్చి, ఆదర్శ పాలన అందించిన మహానుభావుడని అన్నారు.
సామాజిక న్యాయం, ధర్మాన్ని ఆశ్రయించే పాలన ఎలా ఉండాలనే దానికి శ్రీరాముడు చూపించిన మార్గమే నిదర్శనమని గుర్తు చేస్తూ అందుకు అనుగుణంగా రాష్ట్రాభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. రాముని ధర్మాన్ని అనుసరిస్తూ అందరూ సుఖంగా ఉండాలని ఆకాంక్షించారు. ఆ సీతారాముల కరుణాకటాక్షాలు రాష్ట్ర ప్రజలపై ఉండాలని, పాడిపంటలతో రాష్ట్రం సుభిక్షంగా వెలుగొందేలా, ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించేలా దీవించాలని సీతారామచంద్రులను కోట నీలిమ ప్రార్థించారు.




