27-06-2025 08:32:02 PM
సనత్ నగర్,(విజయక్రాంతి): బల్కంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవం, రథోత్సవం, బోనాల పండగకు వచ్చే భక్తులకు మెరుగైన సేవలు అందించాలని టీపీసీసీ ఉపాధ్యక్షురాలు, సనత్ నగర్ నియోజకవర్గ ఇంచార్జి డాక్టర్ కోట నీలిమ అధికారులకు సూచించారు. బోనాల పండగ నేపథ్యంలో శుక్రవారం డా. కోట నీలిమ బల్కంపేట ఎల్లమ్మ తల్లి దేవస్థానాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ పూజరులు, స్థానిక కాంగ్రెస్ నాయకులు ఆమెకు ఘన స్వాగతం పలికారు.
ముందుగా డాక్టర్ కోట నీలిమ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి ప్రసాదం పులిహోర, లడ్డూల తయారీని పరిశీలించారు. ప్రసాదం తయారీ, నాణ్యత విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కావద్దని.. సరైన పాళ్లలో అన్ని ఇంగ్రీడియంట్స్ వేసి రుచికరంగా ప్రసాదం తయారు చేయాలని నిర్వాహకులకు, ఆలయ ఈవో మహేందర్ గౌడ్కు సూచించారు. అమ్మవారి పూజలో ప్రధానంగా ఎదురుకోళ్లు, కళ్యాణోత్సవం, రథోత్సవం నిర్వహించే మూడు రోజుల్లో అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆ మూడు రోజుల్లో భక్తులకు ఉచితంగా ప్రసాదం పంపిణీ చేయాలని ఆలయ ఈవోను కోరారు. ఇంకా అదనంగా ప్రసాదం అవసరం ఉన్నవారు కౌంటర్కు వెళ్లి ప్రసాదం తీసుకుంటారని చెప్పారు.
బల్కంపేట ఎల్లమ్మ తల్లి అంటే సామాన్యుల దేవత అని.. అందుకే ఉచిత ప్రసాద పంపిణీ చేపట్టాలని కోరారు. ఈ బోనాల జాతరకు లక్షలాది మంది భక్తులు వస్తారని.. వారికి ఎలాంటి లోటుపాట్లు లేకుండా దర్శన భాగ్యం కల్పించాలన్నారు. భక్తుల సౌకర్యార్ధం తాగు నీటి, పాదరక్షల కోసం స్టాండ్లు ఏర్పాటు చేయాలని సూచించారు. మరోవైపు పోలీస్ అధికారులతో మాట్లాడి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలన్నారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలకు పూనుకోవాలన్నారు. GHMC అధికారులతో మాట్లాడి శానిటేషన్ విషయంలో తగు జాగ్రత్తలు పాటించాలన్నారు. క్యూలైన్లో ఉన్న భక్తులతో మాట్లాడి ఆలయంలో ఉన్న వసతులపై అడిగి తెలుసుకున్నారు.