calender_icon.png 27 September, 2025 | 1:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నల్లగొండ జిల్లాలో దసరా ఆఫర్లు..!

27-09-2025 12:45:45 PM

100 కొట్టు.. కాటన్ బీర్లు పట్టు..!!

సోషల్ మీడియాలో సందడి 

నిర్వాహకులపై పోలీసులు దృష్టి 

నల్గొండ టౌన్ (విజయక్రాంతి): దసరా పండగ సమీపిస్తుండటంతో అప్పుడే గ్రామాల్లో సందడి మొదలైంది. దసరా పండుగకు పలు వ్యాపార, వాణిజ్య సంస్థలు తమ వస్తువులపై ఆఫర్లు ప్రకటించడం సర్వసాధారణమే. కానీ ఈసారి గ్రామాలలో బంపర్ ఆఫర్లు(Dussehra offers) నడుస్తున్నాయి. 100 రూపాయలు కొట్టు.. మేకను పట్టు, రెండు ఫుల్ బాటిల్స్, రెండు కడకనాథ్ నాటు కోళ్ళు, కాటన్ బీర్లు అంటూ సోషల్ మీడియాలో వెరైటీ ప్రచారం సాగుతోంది. తెలంగాణలో దసరా పండుగను చాలా గ్రాండ్ గా జరుపుకుంటారు. కొత్త బట్టలు సుక్క.. ముక్క లేనిదే నడవదు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని పలు ప్రాంతాల్లో లక్కీ డ్రా పేరుతో విచిత్రమైన దసరా ఆఫర్లు కొనసాగుతున్నాయి.

చిట్యాల, మర్రిగూడ, చౌటుప్పల్, చింతపల్లి తదితర ప్రాంతాల్లో సోషల్ మీడియాలో దసరా ఆఫర్లు సందడి చేస్తున్నాయి. గ్రామాల్లో కొందరు యువకులు 51 రూపాయలు కొట్టు.. మేకను పట్టుకో అని ప్రచారం చేస్తున్నారు. ఈ స్కీంలో 51 రూపాయలు చెల్లించి కూపన్ తీసుకుంటే.. కూపన్ల నుంచి డ్రా తీస్తారు. మొదటి బహుమతిగా పన్నెండు కిలోల మేక, రెండో బహుమతిగా రెండు లిక్కర్ బాటిళ్లు, మూడో బహుమతిగా మరో రెండు లిక్కర్ బాటిళ్లు, నాలుగో బహుమతిగా రెండు కడక్నాథ్ నాటు కోళ్లు, ఐదో బహుమతిగా కాటన్ బీర్లు ఇచ్చేట్లు సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తున్నారు. మరికొన్ని గ్రామాల్లో వంద రూపాయలు కొట్టు.. మేకను పట్టు అంటూ సరికొత్త స్కీం ప్రారంభించారు.

మొత్తంగా నల్గొండ జిల్లాలో(Nalgonda district) దుమ్మురేపుతున్న ఈ ఆఫర్ రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాంతాలకు విస్తరించింది. మాయ లేదు మోసం లేదు.. పూర్తిగా లక్ అంటూ..లక్కీ డ్రా లో మీరే గెలుచు కుంటారు అంటూ పెద్ద ఎత్తున గ్రామాలలో దసరా ఆఫర్లు కొనసాగుతున్నాయి. అయితే 50 రూపాయలు, 100 రూపాయలేగా పోతే పోయేది.. వస్తే మాత్రం అంతకు మించిన విలువైనవి వస్తాయి.. అదృష్టం బాగుంటే మేకనే మన సొంతం అవుతుందని చాలా మంది దసరా సందర్భంగా అదృష్టాన్ని పరీక్షించు కుంటున్నారు. చింతపల్లిలో శ్రీ దుర్గ బేకరీ కూల్ డ్రింక్ నిర్వాహకులు '100 కొట్టు కాటన్ బీర్లు పట్టు' అంటూ సోషల్ మీడియాలో, షాప్ వద్ద ప్లెక్సీ ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. 100 రూపాయల కూపన్ కొనుగోలు చేసిన వారికి 48 కూపన్లకు కాటన్ బీర్లు ఇస్తామని చెప్పి, రూ. 4800 సేకరించి, రూ. 2160 విలువైన బీర్లను అందించి మందుబాబుల జేబులకు చిల్లులు పెడుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి.ఈ దసరా ప్రచారాలపై దసరా పండుగను కూడా సొమ్ము చేసుకుంటున్న సదరు లక్కీ డ్రా ల నిర్వాహకుల పైన పోలీసులు దృష్టి సారించారు.