కృష్ణా జలాల తరలింపుంతో సస్యశామలమైన పాడి పంటలు.
నట్టడవిలో సిరులు కురిపిస్తున్న లక్ష్మీకుంట.
వనపర్తి,(విజయక్రాంతి): శ్రీనివాసపూర్ రిజర్వ్ ఫారెస్ట్(Srinivasapur Reserve Forest) నందు ఆధునీకరించిన లక్ష్మికుంట సమృద్ధిగా కురిసిన వర్షాలతో అలుగుపారుతున్న సందర్భంగా రైతులు,బి.ఆర్.ఎస్ నాయకుల ఆహ్వానం మేరకు శనివారం మాజీ మంత్రివర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్వయంగా ట్రాక్టర్ నడుపుతూ లక్ష్మికుంట చెరువును చేరుకొని అలుగు పారుతున్న గంగమ్మతల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ... శ్రీనివాసపూర్ రిజర్వ్ ఫారెస్ట్ నందు చిన్న కుంటగా ఉండి ఎటువంటి మరమత్తులు లేకుండా నిరుపయోగంగా ఉండడంతో అనాడు రైతులు ఈ కుంటను అభివృద్ధి చేస్తే భూగర్భ జలాలు పెరగడంతో పాటు ఫారెస్టులోని జీవరాశులకు సౌలభ్యంగా ఉంటుందని కోరగా స్పందించిన తాము ఒక బృహత్తర ప్రణాళికతో అటవీశాఖ అనుమతులు సాధించి ఆనాటి ముఖ్యమంత్రి కె.సి.ఆర్ సహకారముతో చిన్నగా ఉన్న మొండికుంటను ఆధునీకరించి లక్ష్మికుంటగా నామకరణం చేయడం జరిగిందన్నారు.
దాదాపు 4కిలోమీటర్ల దూరములో ఉన్న ఈదుల చెరువు నుండి లిఫ్ట్ ద్వారా ఎత్తిపూసి రెండు సంవత్సరాలు నింపడం జరిగిందని ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు కురిసి అలుగు పారడం సంతోషాదయకమన్నారు. ఈ లక్ష్మికుంటతో దాదాపు 400బోర్లు రీఛార్జ్ అవుతూ 650 ఎకరాలకు సాగునీరు అందిస్తుందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. అదేవిధంగా ఫారెస్ట్ లోని అటవీ జీవరాశులు కుందేలు,నెమళ్ళు,దుప్పులు,నెమళ్ళు వంటి జంతువులుకు నీటి సౌకర్యం కలగడంతో అటవీ సంపద కూడా పెరుగుతుందన్నారు. ఈ సందర్భంగా రైతులు, నాయకులు నిరంజన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం లో గట్టుయాదవ్, నందిమల్ల అశోక్, కె.మాణిక్యం, గంధం పరంజ్యోతి,దేవర్ల నరసింహ,చిట్యాల రాము,తదితరులు ఉన్నారు.