27-09-2025 12:54:38 PM
రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జిల్లెల చిన్నారెడ్డి, వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి
వనపర్తి,(విజయక్రాంతి): కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాల సాధన కోసం తెలంగాణలోని ప్రతి పౌరుడు కృషి చేయాలని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జిల్లెల చిన్నారెడ్డి, వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి అన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ(Konda Laxman Bapuji) 110వ జయంతి వేడుకలను శనివారం ఉదయం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ఆవరణలో జిల్లా బి.సి. సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయగా జిల్లా కలెక్టర్ ఆదర్ష్ సురభితో పాటు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జిల్లెల చిన్నారెడ్డి, వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి హాజరై కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా చిన్నారెడ్డి మాట్లాడుతూ... తెలంగాణ సాధన కొరకు పోరాటం చేసిన మహనీయులను తెలంగాణ సమాజం ఎల్లప్పుడూ స్మరించుకుంటూ, వారు చూపిన అడుగుజాడల్లో నడుస్తుంది అన్నారు. మహనీయుల జయంతి, వర్ధంతి వేడుకలను ప్రభుత్వ పరంగా నిర్వహిస్తుందని తెలిపారు. మహనీయుల ఆశయ సాధన కొరకు రాబోయే రోజుల్లో మరింత కృషి చేస్తామని ఇందులో ప్రజలు తమవంతు సహకారం అందించాలని కోరారు.
ఉద్యమకారుడు అనే పదానికి నిలువెత్తు నిర్వచనం.... ఎమ్మెల్యే మేఘా రెడ్డి
ఉద్యమకారుడు అనే పదానికి నిలువెత్తు నిర్వచనం ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ అని ఎమ్మెల్యే మేఘా రెడ్డి అన్నారు. స్వాతంత్య్ర ఉద్యమం నుండి మొదలుకొని మలిదశ తెలంగాణ ఉద్యమం వరకు.. పలు ప్రజా పోరాటాల్లో పాల్గొన్న ధీర చరిత్ర కొండా లక్ష్మణ్ బాపూజీది అన్నారు.
తెలంగాణ ఏర్పాటు కోసం పరితపించిన వ్యక్తి... కలెక్టర్ ఆదర్శ్ సురభి
తెలంగాణ ఏర్పాటు కోసం పరితపించిన ప్రముఖుల్లో కొండా లక్ష్మణ్ బాపూజీ ఒకరని, ఆయన జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమని, ఆయన ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ ఖీమ్య నాయక్, అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు యాదయ్య, వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, ప్రజాప్రతినిధులు రాజేంద్రప్రసాద్, బీసి. సంక్షేమ శాఖాధికారి ముజాహిద్దీన్, జిల్లా అధికారులు, పద్మశాలి సంఘం నాయకులు, సామాజికవేత్త రాజారాం ప్రకాష్, తదితరులు పాల్గొన్నారు.