25-09-2025 01:10:15 PM
గద్వాల,(విజయక్రాంతి) : జోగులాంబ గద్వాల జిల్లాలోని(Jogulamba Gadwal District) నిష్క్రియ రాజకీయ పార్టీలను రిజిస్టర్ పార్టీల జాబితా నుండి తొలగించాలని ప్రతిపాదిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్ గురువారం ప్రకటనలో తెలిపారు. జై మహాభారత్ పార్టీ గత 6 సంవత్సరాలుగా లోక్సభ, రాష్ట్ర శాసనసభ మరియు ఉప ఎన్నికల్లో పోటీ చేయకపోవడంతో ప్రజా ప్రాతినిధ్య చట్టం సెక్షన్ 20ఎ ప్రకారం ఆ పార్టీ ఇక పనిచేయడం లేదని ఆయన పేర్కొన్నారు.
ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 లోని సెక్షన్ 29ఎ ఆర్టికల్ 324 ప్రకారం ఎన్నికల కమిషన్ తన అధికారాలను వినియోగించి ఆ పార్టీని రిజిస్టర్ పార్టీల జాబితా నుండి తొలగించనున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షుడు లేదా ప్రధాన కార్యదర్శి తమ అభ్యంతరాలను ఈనెల 29వ తేదీ లోపు తెలంగాణ ముఖ్య ఎన్నికల అధికారికి సమర్పించాలని సూచించారు. అక్టోబర్ 8వ తేదీన విచారణ జరగనుందని, ఆ సందర్భంగా పార్టీ అధ్యక్షుడు లేదా ప్రధాన కార్యదర్శి తప్పనిసరిగా హాజరు కావాలని కోరారు. తగిన సమాధానం ఇవ్వని పక్షంలో పార్టీకి ఎటువంటి అభ్యంతరాలు లేవని భావించి, ఎన్నికల కమిషన్ ఆ పార్టీని రిజిస్టర్ పార్టీల జాబితా నుండి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తుందని కలెక్టర్ సంతోష్ స్పష్టం చేశారు.