రేపు క్యాబినెట్ అత్యవసర భేటీ
ఉన్నతాధికారులంతా అందుబాటులో ఉండాలి
నేటి మధ్యాహ్నం వరకు నివేదికలు సమర్పించండి
సీఎస్ రామకృష్ణారావు ఆదేశాలు
హైదరాబాద్, జూన్ 30 (విజయక్రాంతి): రాష్ట్ర క్యాబినెట్ అత్యవసర సమావేశం గురువారం మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధ్యక్షతన జరగనుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులంతా తమ ప్రధాన కార్యాలయాల్లో అందుబాటులో ఉండాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు, పాలనాపరమైన అంశాలు, పలు కీలక బిల్లులు, ప్రజా సంక్షేమ పథకాలపై ఈ సమావేశంలో చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు సచివాలయ వర్గాలు చెబుతున్నాయి.
ఎజెండాల రూపకల్పనలో అధికారులు
క్యాబినెట్ భేటీ నేపథ్యంలో ప్రభుత్వంలోని అన్ని శాఖలు ఎజెండా రూపకల్పనలో నిమగ్నమయ్యాయి. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ప్రధాన కార్యదర్శులు, వివిధ శాఖల కార్యదర్శులు ఎజెండా అంశాలను సర్క్యులేషన్ ద్వారా ఆమోదించి, వాటిని తెలుగు అనువాదంతో సహా సాధారణ పరిపాలన శాఖకు సమర్పించాల్సి ఉంటుంది. ఈ నివేదికలను బుధవారం మధ్యాహ్నం 1 గంట వరకు తప్పనిసరిగా అందజేయాలని సీఎస్ ఆదేశించారు. ఏ శాఖలోనైనా అంశాలు లేనట్లయితే ‘నిల్ ’ అని రిపోర్టు ఇవ్వాలని సీఎస్ స్పష్టం చేశారు.






