సమస్యలు పరిష్కరించాలని ఉద్యోగ, ఉపాధ్యాయుల నిరసన
భీమారం,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగుల, గెజిటెడ్ అధికారుల, ఉపాధ్యాయుల, కార్మికుల, పెన్షనర్ల దీర్ఘకాలిక పెండింగ్ సమస్యలపై తెలంగాణ ఉద్యోగ జాయింట్ యాక్షన్ కమిటీ (TGEJAC) పిలుపు మేరకు భీమారం మండల తహసిల్దార్ కార్యాలయం వద్ద శుక్రవారం మధ్యాహ్న భోజన విరామ సమయంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షనర్లు పెద్దఎత్తున నల్ల బ్యాడ్జిలు ధరించి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం సెక్రెటరీ అత్తే సుధాకర్ మాట్లాడుతూ... రెండవ పి.ఆర్.సి (PRC) కమిటీ వేసి 30 నెలలు గడుస్తున్నా నివేదిక రాకపోవడంపై నిరసన వ్యక్తం చేశారు.
వెంటనే నివేదికను తెప్పించి 51% ఫిట్మెంట్తో జూన్ 2వ తేదీలోపు 2వ పి.ఆర్.సిని అమలు చేయాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న సుమారు రూ. 13 వేల కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని, నెలవారీగా ఇచ్చే అరకొర నిధులు ఉద్యోగుల, పెన్షనర్ల అవసరాలకు సరిపోవడం లేదన్నారు. కొత్త ఈహెచ్ఎస్ (Employees Health Scheme) విధానాన్ని వెంటనే అమల్లోకి తీసుకువచ్చి ఉద్యోగుల, పెన్షనర్ల ఆరోగ్య భద్రత కోసం నగదు రహిత చికిత్సను తక్షణమే అందుబాటులోకి తేవాలన్నారు.
ప్రస్తుతం ఉన్న కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (CPS)ను రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని (OPS) పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. పెండింగ్ అంశాలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని, లేని పక్షంలో రాష్ట్ర స్థాయి నాయకత్వం ఆదేశానుసారం ఆందోళనలు కొనసాగుతాయన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో తహసిల్దార్ సదానందం, ఎంపీడీవో మధుసూదన్, వెటర్నరీ డాక్టర్ రాకేష్ శర్మ, ఏఈఓ అరుణ్ కుమార్, జడ్పిహెచ్ఎస్ భీమారం స్కూల్ టీచర్స్ తదితరులు పాల్గొన్నారు.






