calender_icon.png 21 June, 2025 | 4:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈఎన్సీ అనిల్‌కుమార్‌పై బదిలీ వేటు

21-06-2025 01:20:35 AM

చమురు వదిలింది..!

  1. పోస్టింగ్ ఇవ్వకుండా.. రిపోర్ట్ చేయాలని ఆదేశం
  2. కాళేశ్వరం విజిలెన్స్ కమిషన్ రిపోర్ట్ ఎఫెక్ట్
  3. ఇప్పటికే పలువురు కాళేశ్వరం అధికారులకు షోకాజ్ నోటీసులు

హైదరాబాద్, జూన్ 20 (విజయక్రాంతి): కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై సర్కారు సీరియస్‌గా ఉంది. ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికే విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ నివేదిక ఆధారంగా 38 మంది ఇంజినీర్లకు ప్రభుత్వం షోకాజ్ నోటీసులు జారీ చేయగా.. శుక్రవారం రాష్ట్ర నీటి పారుదలశాఖ ఈఎన్‌సీ అనిల్‌కుమార్‌పై బదిలీ వేటు వేసింది. బదిలీపై పంపిన ప్రభుత్వం ఆయనకు ఎలాంటి పోస్టింగ్ ఇవ్వలేదు.

ప్రభుత్వానికి రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. అనిల్ కుమార్ స్థానంలో ఈఎన్‌సీ(అడ్మిన్) అదనపు బాధ్యతల్లో ఉన్న సీఈ అంజాద్ హుస్సేన్‌కు పూర్తిస్థా యి ఈఎన్‌సీ (జనరల్)గా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈమేరకు సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. మేడిగడ్డ బ్యారేజీ గ్రౌటింగ్(బుంగలు పూడ్చటం) వ్యవహారంపై ఆగ్రహంగా ఉన్న సర్కారు అదే కారణంగా అనిల్‌కుమార్‌ను బది లీ చేసినట్లు ఇరిగేషన్ వర్గాలు చెబుతున్నాయి.

మేడిగడ్డ బ్యారేజీ వద్ద గ్రౌటింగ్ పనులు చేపట్టడంతో బ్యారేజీకి సంబంధించిన పలు పరీక్షలు చేయడానికి అవకాశం లేకుండా పోయిందని ఎన్‌డీఎస్‌ఏ(నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ) తన నివేదికలో వెల్లడించడంతో సర్కారు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వానికి ఏ మాత్రం సమాచారం లేకుండా గ్రౌటింగ్ చేయడం వల్ల కాళేశ్వరం అక్రమాలను సమాధి చేసే ప్రయత్నంగా భావిస్తున్నట్లు సమాచారం.

దీనికి తోడు ఇటీవల ఏసీబీకి పట్టుబడిన ఈఈ నూనె శ్రీధర్‌ను బదిలీ చేసినా ఉన్నతాధికారుల ఆదేశాలను పట్టించుకోకుండా అనిల్ కుమార్ అడ్డుగా నిలిచినట్లు సర్కారుకు నివేదికలు అందినట్లు తెలుస్తోంది. ఈ అంశాలన్నింటిపైనా, అనిల్‌కుమార్ వ్యవహారంపైనా పూర్తి వివరాలు తెప్పించుకున్న సర్కారు ఆ మేరకు ఆయన్ను బదిలీ చేసిందని అంటున్నారు. 

క్రిమినల్ చర్యలకు సిఫార్సు.. షోకాజ్ నోటీసులు

ప్రాజెక్టు అక్రమాలపై విచారణ జరిపి ఈ ఏడాది మార్చి 5న విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ శాఖ ప్రభుత్వంతో పాటు విజిలెన్స్ కమిషన్‌కు నివేదిక అందించగా..దీనిపై సమగ్రంగా పరిశీలించిన అనంతరం విజిలెన్స్ కమిషన్ బాధ్యులైన వారిపై కఠినచర్యలకు సిఫార్సు చేస్తూ ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే. పనుల్లో నిర్లక్ష్యం వహించిన 33మంది అధికారులపై క్రమశిక్షణ చర్యలు, 7గురు రిటైర్డ్ అధికారులపై పెన్షన్ రూల్స్ ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. 

అయితే ఇందులో 38మంది ఇంజినీర్లకు ప్రభుత్వం షోకాజ్ నోటీసులు పంపింది. గడువులోగా సమాధానాలు రాకుంటే ఉన్న సమాచారం ఆధారంగా చర్యలు తీసుకుంటామని సర్కారు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో షోకాజ్ అందుకున్న అధికారులు సమాధానం ఇచ్చేందుకు తర్జనభర్జన పడుతున్నట్లు తెలుస్తోంది.