17-12-2025 01:34:37 AM
నోడల్ అధికారిపై చర్య తీసుకోండి
తాండూరు, డిసెంబర్ 16 (విజయక్రాంతి ): ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గెస్ట్ లెక్చరర్ల నియామకాలలో అవినీతి ,అక్రమాలకు పాల్పడుతూ నిజమైన గెస్ట్ లెక్చరర్ లకు అన్యాయం చేస్తున్న జిల్లా ఇంటర్మీడియట్ బోర్డ్ నోడల్ అధికారి శంకర్ నాయక్ పై చర్యలు తీసుకోవాలంటూ వికారాబాద్ జిల్లా తాండూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో నియోజకవర్గ బీసీ సంక్షేమ సంఘం నాయకులు వినతిపత్రం అందించారు.
ఈ సందర్భంగా నాయకులు కందుకూరి రాజ్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలో పది సంవత్సరాలకు పైగా సేవలు అందిస్తున్న అతిథి అధ్యాపకులకు తాజా నియామకాలలో ఎలాంటి స్పష్టమైన కారణం లేకుండా ఉద్యోగాల నుంచి తొలగించబడ్డారని తెలిపారు. గత కొన్నేళ్లుగా అతిథి అధ్యాపకుల కుటుంబాలు ఆర్థికంగా,మానసికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
నిబంధనలకు విరుద్ధంగా ఎంపికలు చేసిన నోడల్ అధికారి శంకర్ నాయక్ పై తగు చర్యలు తీసుకొని గెస్ట్ లెక్చరర్ లకు న్యాయం చేసి అన్యాయంగా విధులనుండి తొలగించబడిన గెస్ట్ లెక్చరర్లను వెంటనే తిరిగి నియమించాలని కోరారు.