12-09-2025 12:50:42 AM
మాదకద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా మరియు ర్యాగింగ్ వ్యతిరేక అవగాహనా కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ఎస్పీ రోహిత్ రాజు
భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 11, (విజయక్రాంతి):యువత,విద్యార్థులు చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా ఉన్నత లక్ష్యసాధనకై కృషి చేయాలని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు అన్నారు.గురువారం పాల్వంచ (నవభారత్) KSM ఇంజినీరింగ్ కళాశాల నందు ఏర్పాటు చేసిన అవగాహనా కార్యక్రమానికి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. డ్రగ్స్ నిర్మూలన కోసం జరుగుతున్న పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు.
విద్యార్థుల దృష్టి తమ భవిష్యత్తు, జీవిత లక్ష్యంపై మాత్రమే ఉండాలని, నిషేధిత గంజాయి,డ్రగ్స్ ఇతర మత్తు పదార్థాల వాడకం పట్ల విద్యార్థులు,యువత ఆకర్షితులు కావద్దన్నారు. గంజాయి,డ్రగ్స్ అలవాటు వలన శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పాడుచేస్తుందని కావున చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. మాదక ద్రవ్యాల నిర్మూలన గంజాయి రహిత జిల్లానే లక్ష్యంగా భద్రాద్రి కొత్తగూడెం పోలీసు శాఖ కృషి చేస్తోందని అందులో బాగంగా విద్యాసంస్థలు, గ్రామాల్లో అవగాహనా కార్యక్రమాలు నిరంతరం నిర్వహించడం జరుగుతుందన్నారు.
మత్తుకు బానిస అవడానికి అనేక కారణాలు ఉంటాయి పరిసరాల ప్రభావం,చెడు స్నేహితులు,సన్నిహితుల వలన చెడు మార్గాల వైపు వెళ్ళవద్దని సూచించారు. గంజాయి,డ్రగ్స్ జీవితాన్ని నాశనం చేయడంతో పాటు భవిష్యత్ లేకుండా చేస్తుందనే విషయాన్ని విద్యార్థులు, యువత గ్రహించి అలాంటి చెడు అలవాట్లకు ఆకర్షితులవ్వద్దని విజ్జప్తి చేశారు. మత్తు పదార్థాలను అరికట్టేందుకు యువత, విద్యార్థులు అంతా యాంటీ డ్రగ్స్ కమిటీలలో సభ్యులుగా చేరి యాంటీ డ్రగ్స్ సోల్జర్ గా సహకరించాలని తెలిపారు. డ్రగ్స్ నివారణలో తమ వంతు పాత్ర పోషించాలని సూచించారు.
మీ మీ ప్రాంతాలలో ఎక్కడైనా గంజాయి ఇతర మత్తు పదార్థాలు విక్రయిస్తున్నట్లు, తాగుతున్నట్లు తెలిస్తే వెంటనే సంబధిత సమాచారాన్ని స్థానిక పోలీసులకు ఇవ్వాలన్నారు. యువతను లక్ష్యంగా చేసుకొని గంజాయి,డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలను అమ్ముతున్న వారిపై కేసులు నమోదు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో సుమారుగా 500 మంది విద్యార్థులు పాల్గొన్నారు.అదే విధంగా విద్యార్థులు ఎవరైనా ర్యాగింగ్ నకు పాల్పడితే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.విద్యార్థులకు ఎలాంటి సమస్యలు ఎదురైనా వెంటనే స్థానిక పోలీసుల దృష్టికి తీసుకురావాలని తెలిపారు.
ప్రస్తుత కాలంలో సైబర్ నేరగాళ్లు ఎన్నో రకాలుగా అమాయకుల ఖాతాల్లో నుండి నగదును కాజేస్తున్నారని,ఎప్పటికప్పుడు సైబర్ నేరాల పట్ల అవగాహన కలిగియుండి తమ చుట్టుప్రక్కల వారికి కూడా అవగాహనా కల్పిస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.ముఖ్యంగా విద్యార్దినులు సోషల్ మీడియా వినియోగించే టప్పుడు అప్రమత్తంగా ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో పాల్వంచ డిఎస్పీ సతీష్ కుమార్,ఎస్బి ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, కళాశాల ప్రిన్సిపాల్ జగన్మోహన్ రావు మరియు పాల్వంచ ఎస్త్స్ర సుమన్,కళాశాల అధ్యాపాకులు, విద్యార్డినీ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.