calender_icon.png 21 June, 2025 | 10:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రతి ఒక్కరూ యోగాను భాగం చేసుకోవాలి

21-06-2025 04:45:52 PM

జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మి నారాయణ..

గద్వాల టౌన్: ఆరోగ్యకర సమాజాన్ని నిర్మించడంలో యోగ ఎంతో తోడ్పాటునిస్తుందని, నిత్య జీవితంలో ప్రతి ఒక్కరూ యోగాను భాగం చేసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మి నారాయణ(District Additional Collector Lakshmi Narayana) తెలిపారు. శనివారం జిల్లా కేంద్రలోని స్మృతి వనంలో నిర్వహించిన 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ఆయన పాల్గొని యోగాసనాలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ అంతర్జాతీయ యోగా దినోత్సవం(International Yoga Day) సందర్భంగా ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన యోగా ప్రాముఖ్యతను ప్రజలకు వివరించారు. భూమిని సాగు చేయడానికి మనం ఎంత శ్రద్ధ తీసుకుంటామో, అలానే మన శరీరం అనే భూమిని ఆరోగ్యంగా ఉంచుకోవడంలో కూడా అంతే శ్రద్ధ అవసరమని తెలిపారు.

భూమిని శుద్ధి చేసి విత్తనాలు వేసినప్పుడు మంచి పంట వచ్చినట్లు,మన శరీరాన్ని యోగా ద్వారా శుద్ధి చేసి, మంచినే ఆచరిస్తూ,శుభ ఆలోచనలు పెంపొందిస్తే ఆరోగ్యం అనే అమూల్యమైన ఫలితాన్ని పొందవచ్చని తెలిపారు.ఒక డాక్టర్ వ్యాధి వచ్చిన తరువాత దానికి చికిత్స అందిస్తారని, కానీ యోగా మాస్టర్ ముందుగానే శరీరం, మనస్సు ఆరోగ్యంగా ఉండేలా మార్గం చూపిస్తారని తెలిపారు. యోగా అనేది కేవలం వ్యాయామం కాదని ,ఇది మన శరీరానికి ఆరోగ్యాన్ని,మనసుకు ప్రశాంతతను ఇచ్చే మార్గమని అన్నారు.యోగా చేయడం ద్వారా మన జీవితానికే కొత్త దారితెరుస్తుందని తెలిపారు. యోగాన్ని మన దైనందిన జీవితంలో భాగం చేసుకుంటే, శారీరకంగా బలంగా,మానసికంగా నిలకడగా ఉంటామని అన్నారు.ప్రతి రోజు కనీసం 30 నిమిషాలు యోగా చేసేందుకు సమయాన్ని కేటాయించాలని సూచించారు.

యోగా వంటి శ్రద్ధా జీవనశైలిని పాటిస్తే, ముందుగా మన ఆరోగ్యం మెరుగవుతుందని తెలిపారు.ఆరోగ్యంగా, ప్రశాంతంగా ఉన్నప్పుడు మన కుటుంబం సంతోషంగా ఉంటుందని,మన పని స్థలంలో మన పనితీరు మెరుగవుతుందని చెప్పారు. మనపై ఆధారపడే వారు సురక్షితంగా,ఆనందంగా ఉంటారని,ఈ విధంగా ఒక వ్యక్తిలో మొదలైన సానుకూలత చివరికి సమాజానికే శాంతిని, సుభిక్షాన్ని అందిస్తుందని తెలిపారు. అనంతరం ఐడీఓసి కార్యాలయంలో యోగా దినోత్సవం సందర్భంగా అదనపు కలెక్టర్  కార్యాలయ సిబ్బందితో కలిసి యోగా చేశారు. అనంతరం యోగా యొక్క ప్రాధాన్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో ఎ.ఓ భూపాల్ రెడ్డి,ఈడీ ఎస్సీ రమేష్ బాబు,జిల్లా పరిశ్రమల శాఖ జి.యం రామ లింగేశ్వర్ గౌడ్,జిల్లా వ్యవసాయాధికారి సక్రియా నాయక్,డాక్టర్ మోహన్ రావు,సీనియర్ సిటిజెన్ అసోసియేషన్ అధ్యక్షులు మోహన్,ఆశా వర్కర్లు,కలెక్టరేట్ సిబ్బంది,యువకులు తదితరులు పాల్గొన్నారు.