శిశుమందిర్ అభివృద్ధికి సహకరిస్తా
కరీంనగర్ క్రైమ్,(విజయక్రాంతి): కరీంనగర్ పట్టణంలోని శ్రీ సరస్వతీ శిశుమందిర్ ఉన్నత పాఠశాల అభివృద్ధి, ప్రగతి కార్యక్రమాలపై వివరణ ఇవ్వడానికి పాఠశాల ప్రతినిధుల బృందం కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ని మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ బృందంలో కార్యదర్శులు ఎలగందుల సత్యనారాయణ, ఇంజనీర్ కోల అన్నారెడ్డి, గట్టు శ్రీనివాస్ మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మోర రణధీర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పాఠశాలలో అమలు చేస్తున్న విద్యా విధానాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, విద్యార్థుల్లో నైతిక విలువల పెంపుదల వంటి అంశాలను వివరంగా తెలియజేశారు. శిశుమందిర్ పాఠశాలలు మెరుగైన విద్యతో పాటు సద్గుణాలు, సంస్కారాలను పెంపొందిస్తూ సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని మంత్రి ప్రశంసించారు. తాను కూడా శిశుమందిర్ పాఠశాలలో విద్యాభ్యాసం చేసి ఈ స్థాయికి చేరుకున్నానని పేర్కొంటూ, శిశుమందిర్ పాఠశాలల బలోపేతం దేశ నిర్మాణానికి శుభసూచకమని అభిప్రాయపడ్డారు. పాఠశాల అభివృద్ధికి అవసరమైన సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.






