06-02-2026 12:00:00 AM
అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్
నిజామాబాద్, ఫిబ్రవరి 5 (విజయ క్రాంతి) : 2027 సంవత్సరంలో జరుగనున్న గోదావరి పుష్కరాలను పురస్కరించుకుని విస్తృత ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ అధికారులకు సూచించారు. కలెక్టరేట్ లో గురువారం గోదావరి పుష్కరాలు-2027 ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష సమావేశం జరిగింది. పుణ్య స్నానాలు ఆచరించేందుకు వీలుగా పుష్కర ఘాట్ల వద్ద ప్రజల సౌకర్యార్థం అన్ని వసతులు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు.
జిల్లాలోని గోదావరి పరీవాహక ప్రాంతాలైన కందకుర్తి, తాడ్ బిలోలి, కోస్లీ, తుంగిని, బినోల, ఉమ్మెడ, పోఛంపాడ్,. సావెల్, తడ్పాకల్, దోంచంద, గుమ్మిర్యాల్ వద్ద 15 పుష్కర ఘాట్లు ఉంటాయని, వీటితోపాటు అనువైన ప్రదేశాలను కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించి గుర్తించవచ్చ న్నారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా గోదావరి నది తీరంలో సౌకర్యాల కల్పన దిశగా పుష్కర ఘాట్ల వద్ద చేపట్టాల్సిన పనులను గుర్తించాలన్నారు.
గత పుష్కరాలలో గోదావరి నదిలో పుష్కర స్నానం చేసిన భక్తుల సంఖ్య, భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన స్టాళ్లు, తాగునీరు, తాత్కాలిక గదులు, వాహనాల పార్కింగ్ ఇతర ఏర్పాట్ల వివరాలను పరిశీలించి, ఆయా శాఖల వారీగా వివరాలు సమర్పించాలన్నారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.