1 June, 2026 | 2:00 PM

బీఆర్‌ఎస్‌లో గ్రూపుల గోల

01-06-2026 01:29 PM

వరిగుంతం, పోతంశెట్టిపల్లి గ్రామాలలో రెండు గ్రూపులుగా బిఆర్ఎస్.

ఎమ్మెల్యే వద్దకు చేరిన గ్రూపుల పంచాయితీ.

అయినా సర్దుకొని పంచాయతీ.

కొల్చారం: కొల్చారం మండలంలోని పోతంశెట్టిపల్లి, వరిగుంతం గ్రామాలలో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలో(BRS Party) గ్రూపుల గోల రోజురోజుకు ముదిరిపోతుంది.  గ్రూపుల కారణంగా నాయకులు రోడ్డుపైనే గొడవలు పడుతున్నారు. గ్రూపుల సమస్యలు పరిష్కరించాల్సిన మండలానికి చెందిన మండల, జిల్లా స్థాయి నాయకులు పట్టించుకోక పోవడంతో రోజురోజుకు గ్రూపుల గోల ముదిరి పాకాన పడుతుంది. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో పోతంశెట్టి పల్లి గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా నిలబడిన వ్యక్తి ఇతర పార్టీల అభ్యర్థులతో పోటీ నుండి తప్పుకోకపోవడంతో పార్టీకి సర్పంచ్ అభ్యర్థి కరువయ్యారు. ఆ అభ్యర్థికి ఎమ్మెల్యే సునీత  లక్ష్మారెడ్డి ప్రాధాన్యత ఇవ్వడంతో గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్, మాజీ ఎంపీటీసీ సభ్యులు, ఏడుపాయల ఆలయ కమిటీ మాజీ డైరెక్టర్ లతోపాటు ఇతర నాయకులు మరో గ్రూపుగా ఏర్పడ్డారు.

ఇటీవల మండల కేంద్రమైన కొల్చారంలో ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఇందిరమ్మ ఇండ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి హాజరు కాగా ఆమె సమక్షంలోనే రెండు గ్రూపుల నాయకులు ఎంపీడీవో కార్యాలయం ముందు బహిరంగంగా పరస్పరం దూషించుకున్నారు. ఒకరి పై ఒకరు దాడి చేసుకునే స్థాయికి వెళ్ళగా మండలంలోని ఇతర గ్రామాల నాయకులు వారికి సర్ది చెప్పారు. మండలంలోని వరిగుంతం గ్రామంలో గ్రామానికి చెందిన జిల్లా నాయకులు చెప్పుచేతల్లో సర్పంచ్ ఉండడం వల్ల ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్లు, సహకార సంఘం అధ్యక్షులు మరో వర్గంగా ఏర్పడ్డారు. సొంత పార్టీ సర్పంచ్ పై జిల్లా పంచాయతీ అధికారికి కలెక్టర్కు ఫిర్యాదు చేసుకునే స్థాయికి వెళ్లారు.

ఈ పంచాయతీ ఎమ్మెల్యే వద్దకు వెళ్లినప్పటికీ ఈ పరిష్కారం కాకపోవడం వరిగుంతంలో కూడా గ్రూపుల కూడా కొనసాగుతుంది. ఇటీవల వరిగుంతంలో జరిగిన గ్రామసభకు సర్పంచ్ హాజరు కాలేదు. పంచాయతీ పాలకవర్గ సమావేశం డోర్లు కిటికీలు మూసి నిర్వహించారు. అనంతరం నిర్వహించిన గ్రామసభకు మాజీ సర్పంచ్లు, సహకార సంఘం అధ్యక్షులు ఇతర ముఖ్య నాయకులు ఎవరు హాజరు కాలేదు. దీంతో గ్రూపుల సమస్య కొల్చారం మండలంలో రోజురోజుకు పెరిగిపోతుంది. మండలంలోని ఆయా గ్రామాలలో గ్రూపుల సమస్య పరిష్కరించాల్సిన మండల పార్టీ అధ్యక్షుడు, ఇతర జిల్లా నాయకులు పట్టించుకోకపోవడం, ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మండలంలో కొంతమంది వ్యక్తులకే ప్రాధాన్యత ఇవ్వడం వల్ల 

బిఆర్ఎస్ లో గ్రూపులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. మండలంలోని అన్ని గ్రామాలలో మొదటినుండి ఉన్న ఉద్యమకారులు ఒక గ్రూపు గా ఉండగా ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నుండి వచ్చిన నాయకులు ఒక గ్రూపుగా ఏర్పడుతున్నారు. దీంతో కొల్చారంలో గ్రూపుల సమస్య రోజురోజుకు పెరిగి పోతున్నది. ఈ విషయమై మండల పార్టీ అధ్యక్షుడు గౌరీ శంకర్ ను వివరణ కోరగా  పార్టీలో గ్రూపుల సమస్య ఏమీ లేదంటూ సమాధానం దాటవేశారు.