24 June, 2026 | 2:30 AM

నకిలీ పత్తి విత్తనాల ముఠా గుట్టురట్టు

24-06-2026 01:27 AM

తుర్కపల్లి బస్‌స్టాండ్‌లో అధికారుల విస్తృత తనిఖీలు

పోలీసుల అదుపులో నిందితుడు, పరారీలో మరొకరు

నిందితుడి కోసం గాలింపు

యాదాద్రి భువనగిరి, జూన్ 23 (విజయక్రాంతి): నకిలీ పత్తి విత్తనాల అక్రమ రవాణాపై తుర్కపల్లి పోలీసులు పెద్ద ఎత్తున దాడులు నిర్వహించి అంతర్రాష్ట్ర ముఠా గుట్టును రట్టు చేశారు. ఈ దాడిలో రూ.10 లక్షల విలువైన 150 కిలోల నకిలీ బీజీ-11 పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకొని ఒక నిందితుడిని అరెస్ట్ చేసినట్లు యాదాద్రి డీఎస్పీ శ్రీనివాస్ నాయుడు తెలిపారు.

మంగళవారం తుర్కపల్లి పోలీస్ స్టేషన్‌లో యాదగిరిగుట్ట రూరల్ సీఐ శంకర్ గౌడ్, తుర్కపల్లి ఎస్‌ఐ ఎండీ తకియుద్దీన్‌తో కలిసి విలేకరుల సమావేశంలో కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం కేశనపల్లికి చెందిన దొండపాటి మల్లికార్జునరావు నిషేధిత బీజీ-11 పత్తి విత్తనాలను గుంటూరు నుంచి సిద్ధిపేటకు అక్రమంగా తరలిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారులు సంయుక్తంగా తుర్కపల్లి బస్ స్టాండ్ సమీపంలో తనిఖీలు నిర్వహించి ఒకరిని అదుపులోకి తీసుకుని విచారించారన్నారు. 

చిత్తూరు జిల్లాకు చెందిన శంకర్‌తో కలిసి తెలంగాణలో నకిలీ పత్తి విత్తనాల విక్రయానికి కుట్ర పన్నినట్లు వెల్లడైందన్నారు. అతడి వద్ద నుంచి బిల్లా బీజీ-11999 పేరుతో ఉన్న 70 కిలోల నకిలీ పత్తి విత్తనాల ప్యాకెట్లు, మరో 80 కిలోల కల్తీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.పరారీలో ఉన్న రెండో నిందితుడు శంకర్ ను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.