05-12-2025 09:11:07 AM
రహస్య సర్వేను అడ్డుకున్న రాళ్ళకత్వ, దాడిగూడెం రైతులు
చేసేదేమీ లేక జారుకున్న ఏడీ
పటాన్చెరు: సంగారెడ్డి జిల్లా జిన్నారం మున్సిపాలిటీలోని ఊట్ల రెవెన్యూ దాదిగూడెం శివారులోని అంతయ్య చెరువుకు ఆనుకుని ఉన్న సర్వే నెంబర్ 829 లో సంగారెడ్డి జిల్లా మైనింగ్ ఏడీ డిజిటల్ సర్వే పరికరాలు తీసుకువచ్చి సర్వే చేయడానికి వచ్చారు. అధికారులను చూసి చుట్టుపక్కల రైతులు వచ్చి రైతులకు సమాచారం ఇవ్వకుండా ఏం సర్వే చేయడానికి వచ్చారని అడుగగా మండల తహసీల్దార్ ఈ స్థలాన్ని సర్వే చేయమని పంపారని చెప్పడంతో అక్కడున్న రైతులు తీవ్రంగా మండిపడ్డారు. రాళ్లకత్వ గ్రామానికి చెందిన రైతులు గత రెండు, మూడు సంవత్సరాలుగా హైకోర్టు, మైనింగ్ కోర్టుల చుట్టూ తిరుగుతున్నామని తెలిపారు. రైతుల పొలాలు పాడవుతున్నాయని వాటిని కాపాడుకోవడానికి పోరాడుతున్న సంగతి మీకు తెలీదా అంటూ ప్రశ్నించారు. కంకర క్వారీలకు, మైనింగ్ మాఫియా యజమానులకు రైతుల భూములు ఇవ్వడానికి ఈ సర్వే చేస్తున్నారా అంటే మైనింగ్ ఏడీని నిలదీశారు. దీంతో చేసేదేమీ లేక ఏడీ అక్కడి నుండి జారుకున్నారు.