కరెంట్ కోతలపై రైతుల అందోళన
కామారెడ్డి జిల్లా పద్మాజివాడి సబ్ స్టేషన్ ముట్టడి
సదాశివనగర్, మార్చ్ 17 (విజయక్రాంతి): వేసవి కాలం ఆరంభానికి ముందే కరెంటు కష్టాలు మొదలయ్యాయి. గత వారం రోజుల నుంచి కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలంలోని పద్మాజివాడి సబ్ స్టేషన్ పరిధిలోని వివిధ గ్రామాలకు సరఫరా కరెంటులో కోతలు విధిస్తున్నారని రైతుల ఆగ్రహం వ్యక్తం చేస్తూ మంగళవారం సబ్ స్టేషన్ను ముట్టడించారు.
ముడేగాం, పద్మాజీవాడి రైతులు తమ పంటలకు కరెంట్ సరఫరాలో నిత్యం 2 నుంచి 3 గంటలు కోతలు విధిస్తున్నారని, దీంతో చేతికి వచ్చిన పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొందని విద్యుత్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వేసవికాలం ఆరంభం కాకముందే ఇలా కోతలు విధించడం తగదన్నారు. కరెంటు కోతలపై ఫోన్లు చేస్తే సంబంధిత అధికారులు ఎవరు కూడా స్పందించడం లేదని ఆరోపించారు. వ్యవసాయానికి కోతలు లేకుండా కరెంటు సరఫరా చేయాలని రైతులు డిమాండ్ చేశారు.




