29-06-2025 02:12:27 AM
బేరసారాల వెనుక ఫోన్ ట్యాపింగ్
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 28 (విజయక్రాంతి): ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో ‘బీజేపీ.. ఎమ్మెల్యేల కొనుగో లు కేసు’ పునాదులే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ప్రమాదంగా మారనున్నట్లు తెలుస్తోంది. ఆనాడు ప్రగతిభవన్లో విడుదల చేసిన ఆడియో, వీడియో టేపులే..చట్టవిరుద్ధమైన ఫోన్ ట్యాపింగ్ ద్వారా సేకరించిన విగా సిట్ అనుమానిస్తోంది. ఈ కోణంలో దర్యాప్తు ముమ్మరం కావడంతో, త్వరలోనే మాజీలను విచారణకు పిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.
2022 అక్టోబర్ 26న మొయినాబాద్లోని ఫామ్హౌస్లో నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పైలట్ రోహి త్రెడ్డి, గువ్వల బాలరాజు, బీరం హర్షవర్ధన్రెడ్డి, రేగా కాంతారావు కొనుగోలుకు బేర సారాలు జరిగాయంటూ వచ్చిన ఆడియో, వీడియోలు రాష్ర్టవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. అప్పటి సీఎం కేసీఆర్, 2022 నవంబర్ 3న ప్రగతి భవన్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి, ఈ వ్యవహారం వెనుక బీజేపీ ఉందని ఆరోపిస్తూ పెన్డ్రైవ్లు విడుదల చేశారు.
అంతేకాదు, ఆ సా క్ష్యాలను దేశంలోని అన్ని హైకోర్టులు, సు ప్రీంకోర్టు న్యాయమూర్తులకు కూడా పంపించారు. అయితే ఈ రహస్య ఆపరేషన్కు సం బంధించిన ఆధారాలన్నీ చట్టవిరు ద్ధమైన ఫోన్ ట్యాపింగ్ ద్వారానే సేకరించారని సిట్ అధికారులు ఇప్పుడు బలంగా విశ్వసిస్తున్నా రు. బీజేపీని ఇరుకున పెట్టేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం పన్నిన వ్యూహమే ఇప్పుడు రివర్స్ అవుతోందా..
ప్రగతిభవన్లో విడుదలైన ఆ పెన్డ్రైవ్లను సిట్ అధికారులు స్వాధీనం చేసుకుని, వాటిలోని డేటాను సాంకేతికంగా విశ్లేషిస్తున్నారు. ఈ ఆడియో, వీడియోటేపులు ఏ సర్వర్ నుంచి వచ్చాయి? వాటిని ఎవరు, ఎవరి ఆదేశాల మేరకు ట్యాప్ చేశారు? అసలు డేటాను పెన్డ్రైవ్లోకి ఎవరు ఎక్కించారు? ఈ ప్రశ్నలకు సమాధానాలు రాబట్టేందుకు సిట్ ప్రయత్నిస్తోంది.
కవిత పీఏకూ సిట్ నోటీసులు..
మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పీఏకు సిట్ నోటీసులు జారీ చేసింది. నిందితుడు ప్రణీత్రావు ఫోన్లో కవిత, ఆమె పీఏకు సంబంధించిన ఆడియో రికార్డింగులు లభించడంతో, విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. బీఆర్ ఎస్ హయాంలో నాయకులు, జడ్జీలు, జర్నలిస్టులు, పారిశ్రామికవేత్తలతో సహా మొత్తం 618 మంది కీలక వ్యక్తుల ఫోన్లు ట్యాప్ అయినట్లు సిట్ నిర్ధారించింది. వీరిలో ఇప్పటికే 228 మంది వాంగ్మూలాలను నమోదు చేసింది.