50మంది విద్యార్థినులకు అస్వస్థత
ఆరుగురి పరిస్థితి విషమం
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 25 (విజయక్రాంతి): చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మహిళా దక్షిత సమితి విద్యాసంస్థలకు చెందిన బన్సీలాల్ మలానీ నర్సింగ్ కాలేజీలో మంగళవారం పాడైపోయిన ఆహారం తిని 50 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. యాజమాన్యం వారిని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నట్లు తెలిసింది. దీనిపై యాజమాన్యాన్ని వివరణ కోరగా.. విద్యార్థులకు ఫుడ్పాయిజన్ కాలేదని, కలుషిత నీటితో వారు అస్వస్థతకు గురయ్యారని సమాధానమిచ్చారు. దీనిపై జలమండలి మియాపూర్ ఏరియా అధికారి నాగప్రియను వివరణ కోరగా.. కలుషిత నీటి సరఫరా చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఫుడ్ సేఫ్టీ అధికారి హృదయని వివరణ కోరగా.. సదరు హాస్టల్లో తనిఖీ చేసి నిజానిజాలు వెలికి తీస్తామన్నారు.






