ఫెర్రీ బోల్తా.. ఏడుగురు మృతి
ఉత్తర సైప్రస్ తీరంలో ఘటన
టర్కీ, ఆగస్టు 30: ఉత్తర సైప్రస్ (North Cyprus) తీరంలో సుమారు 270 మంది ప్రయాణికులు, సిబ్బందితో వెళ్తున్న ఫెర్రీ ఆదివారం బోల్తా పడింది. దీంతో ఏడుగురు మరణించారు. 237 మందిని రక్షించామని, మరో 24 మంది కోసం రక్షణ విభాగాలు, కోస్ట్గార్డ్ సిబ్బంది గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని ప్రధాన మంత్రి ఉనాల్ ఉస్టెల్ తెలిపారు. ఫెర్రీ బయలుదేరిన 15 నిమిషాలకే ప్రతికూల వాతావరణంతో నీరు లోపలికి రావడం ప్రారంభించిందని పేర్కొన్నారు.
ఆ తర్వాత కొద్దిసేపటికే సహాయం కోసం పిలుపు అందిందని ఆయన చెప్పారు. సైప్రస్ ఉత్తర ప్రాంతంలో ఉన్న గిర్నే అని కూడా పిలువబడే కైరేనియా ఓడరేవు నుంచి, మెర్సిన్ ప్రావిన్స్లోని టర్కీ ఓడరేవు అయిన టాసుకుకు ఒక కాటమరాన్ తరహా ఫెర్రీ ప్రయాణిస్తోంది. డెనిజ్సిలిక్ ఫెర్రీ కంపెనీకి చెందిన ఈ నౌక ఫిలో, సైప్రస్ ఉత్తర తీరంలోని డయానా బీచ్ సమీపంలో మునిగిపోయిందని కైరేనియా మేయర్ మురత్ సెంకుల్ తెలిపారు. తీరం నుంచి సుమారు 7.5 కిలోమీటర్ల (4 నాటికల్ మైళ్ల) దూరంలో ఈ ప్రమాదం జరిగినట్లు పేర్కొన్నారు.






