20-06-2025 12:00:00 AM
ఎల్బీనగర్, జూన్ 19: ఉమ్మడి ఏపీలో నిస్సహాయక స్థితిలో ఉన్న దివ్యాంగ సమాజాన్ని ఏకం చేసి, వారి హక్కులు సాధించుకున్న చరిత్ర ఎమ్మార్పీఎస్, వీహెచ్పీఎస్లకు ఉన్నదని, భవిష్యత్తులోనూ దివ్యాంగుల హక్కులతో పాటు రాజకీయ భాగస్వామ్యం సాధించేంతవరకు దివ్యాంగులకు ఆత్మబంధువుగా రాజీలేని పోరాటం కొనసాగిస్తానని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పేర్కొన్నారు.
పద్మశ్రీ పురస్కారం పొందిన మంద కృష్ణ మాదిగకు గురువారం నాగోల్లో దివ్యాంగులు సన్మాన సభను నిర్వహించారు. అనంతరం వీహెచ్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు జంగయ్య అధ్యక్షతన జరిగిన సభలో మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ.. పద్మశ్రీ పురస్కారం సమాజంలోని అణచివేతకు గురైన వర్గాల ప్రయోజనాలు కాపాడే విషయంలో మరింత బాధ్యతను పెంచింద న్నారు.
నిరంతరం ప్రజల్లో ఉంటూ కులం, మతంతో సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రజల కోసం పోరాటం కొనసాగిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో వీహెచ్పీపీఎస్ జాతీయ కోర్ కమిటీ చైర్మన్ గోపాలరావు, వైస్ చైర్మన్ అందె రాంబాబు, జాతీయ అధ్యక్షుడు సుజాత సూర్యవంశీ, జాతీయ మహిళా అధ్యక్షురాలు సామినేని భవాని చౌదరి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు అన్యం చిన్న సుబ్బయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు.