'పంచాయతీ పోరు'.. నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మొదటి దశ పంచాయతీ ఎన్నికలకు(Gram Panchayat elections)నేటి నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. ఈ దశలో 189 మండలాల్లో మొత్తం 4,236 సర్పంచ్ స్థానాలు, 37,440 వార్డు స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభానికి గుర్తుగా గురువారం ఆయా జిల్లాల్లో కలెక్టర్లు ఎన్నికల నోటిఫికేషన్లు జారీ చేయనున్నారు. నవంబర్ 29 వరకు నామినేషన్లు స్వీకరించబడతాయి. ఆ తర్వాత నవంబర్ 30న పరిశీలన జరుగుతుంది. పరిశీలన నిర్ణయాలకు సంబంధించిన పిటిషన్ సమర్పణలను డిసెంబర్ 1న స్వీకరించి మరుసటి రోజు పరిష్కరిస్తారు.అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవడానికి డిసెంబర్ 3 వరకు సమయం ఉంటుంది. ఆ తర్వాత అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తారు. డిసెంబర్ 11న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరగుతుంది.
అదే రోజున ఓట్ల లెక్కించి వార్డు సభ్యులు, సర్పంచ్ ఫలితాలు వెల్లడించనున్నారు. ఈ ప్రక్రియలో భాగంగా డిప్యూటీ సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు కూడా నిర్వహించబడతాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) ఆదేశాల మేరకు, ఎన్నికలు సజావుగా నిర్వహించడానికి అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. బుధవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని జిల్లా కలెక్టర్లు, కమిషనర్లు, ఎస్పీలు, ఇతర సీనియర్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సంసిద్ధతను సమీక్షించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రశాంతంగా,సమర్థవంతంగా పోలింగ్ జరిగేలా శాంతిభద్రతల నిర్వహణ, పోలింగ్ సిబ్బందిని నియమించడం, సిబ్బందికి శిక్షణ, మొత్తం ఎన్నికల ప్రోటోకాల్కు సంబంధించిన మార్గదర్శకాలను జారీ చేశారు.




