calender_icon.png 14 June, 2025 | 7:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పిడికిలెత్తిన బంజారాలు

14-06-2025 01:21:46 AM

  1. తెలంగాణలో లంబాడీల జనాభా 20 లక్షలు.. మొత్తం జనాభాలో వీరు 9 శాతం
  2. రాజకీయాల్లో తమకు తగిన ప్రాధాన్యమివ్వాలని వారి డిమాండ్
  3. కర్ణాటక తరహాలో డిమాండ్ల సాధనకు సన్నాహాలు

హైదరాబాద్, జూన్ 13 (విజయక్రాంతి): తెలంగాణ పరిధిలోని షెడ్యూల్ తెగల్లో లంబాడీలది అతిపెద్ద జనాభా. రాష్ట్రంలో మొత్తం ఎస్టీల జనాభా 30 లక్షలు కాగా, వీరిలో 20 లక్షలు లంబాడీలు. 2011 జనాభా లెక్కల ప్రకారం 20,46,117. ఈ చొప్పున రాష్ట్ర జనాభాలో వీరి శాతం 9. ఇప్పుడు వారి జనాభా లెక్కెస్తే మరింత పెరుగుతుందనేది సుస్పష్టం.

తెలంగాణ వచ్చిన తర్వాత తొలి ప్రభుత్వంతో పాటు ఏడాదిన్నర క్రితం పగ్గాలు చేపట్టిన కొత్త ప్రభుత్వం సైతం లంబాడీల సంక్షేమం కోసం కృషి చేస్తున్నాయి. ఎస్టీల సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలు లంబాడీలకూ మేలు చేస్తున్నాయి. అయినప్పటికీ తమ జీవన ప్రమాణాలు పెరగడం లేదని, రాజకీయాల్లో తమ ప్రాతినిధ్యం పెద్దగా లేదని లంబాడీలు పెదవివిరుస్తున్నారు.

మంత్రివర్గంలోనూ లంబాడీ ఎమ్మెల్యేలకు చోటు కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా, తమ సంక్షేమం కోసం పథకాలు ప్రవేశపెట్టడాన్ని తాము స్వాగతిస్తున్నామని, హైదరాబాద్ నడిబొడ్డున బంజారా భవన్ నిర్మించడం తమకు ఆనందాన్నిచ్చిందని, కానీ, రాజకీయాల్లో తమకు పెద్దగా ప్రాధాన్యం కల్పించకపోవడం సరికాదని అభిప్రాయపడుతున్నారు.

ఏళ్ల తరబడి తాము ఎదుర్కొంటున్న పోడు భూ ముల సమస్యకు ఏ ప్రభుత్వమూ సరైన పరిష్కారం చూపించలేక పోతుందని వాపోతున్నారు. రాష్ట్రంలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రానున్న నేపథ్యంలో లంబాడీ నేతలు ఐక్యమవుతున్నారు. రాజకీయ పార్టీల ఎదుట తమ డిమాండ్లను బలంగా వినిపించేందుకు సిద్ధమవుతున్నారు. కర్ణాటక తరహాలో రాజకీ యాల్లో తమ సత్తా చాటేందుకు ఉవ్విళ్లూరుతున్నారు.

దేశంలోనే అతిపెద్ద సంచార తెగ..

భారత్‌లో బంజారా, సుగాలి, గోర్‌లే లంబాడీలుగా పేర్గాంచారు. ఇది భారత్‌లోని సంచార తెగల్లో ఒకటి. కర్ణాటక, తెలంగాణ, ఏపీల్లో వీరి జనాభా అధికంగా ఉంది. వీరు ఏళ్ల క్రితమే దక్షిణాదికి వలస వచ్చారు. తండాల నుంచి నివాస యోగ్యమైన ప్రాంతాల్లో వలస వెళ్లి వ్యాపారులుగా స్థిరపడ్డారు. వారి సంస్కృతీ సంప్రదాయాలు, వేష భాషలు ప్రత్యేకం. అనాది నుంచి లంబాడీలు కళలు, సంగీతానికి ప్రాధాన్యతనిచ్చారు.

లంబాడీ భాష ఇండో సమూహానికి చెందినది. కానీ దీనికి లిపి లేదు. అద్దాలు, పూసలతో తయారు చేసిన వస్త్రాలను లంబాడీ మహిళలు ధరిస్తారు. తెగకు చెందిన యువతులు మంచి వరుడి కోసం తీజ్ పండుగ నిర్వహిస్తారు. తెగ ప్రధానంగా హిందూ మతాన్ని అనుసరిస్తుం ది. తెగలో సంస్కరణల కోసం కృషి చేసిన సంత్ సేవాలాల్ మహారాజ్  వంటి వ్యక్తులను వారు పూజిస్తారు. లంబాడీల సామా జిక, సాంస్కృతిక గుర్తింపు.. వారు నివసించే తండా.

అది స్వయంగా ఏర్పరచుకున్న వా రు నివాసయోగ్యమైన ప్రాంతం. తెగలో నా యక్ కులపెద్ద. ఇతడు తండాల్లో సామాజిక, రాజకీయ, మతపరమైన విషయాలను పర్యవేక్షిస్తాడు. ఇప్పటికీ తండాలు లంబాడీల చారిత్రక స్వాతంత్య్రానికి ప్రతీకగా పరిఢవిల్లుతున్నాయి. నల్లగొండ, వరంగల్ ఉమ్మడి జిల్లాలకు చెందిన లంబాడీ మహిళలు వ్యవసాయ కార్మికులుగా పనిచేస్తున్నారు. 

రాజకీయాల్లోనూ హవా..

ఏపీ, తెలంగాణతోపాటు పలు రాష్ట్రాల్లో లంబాడీలు షెడ్యూల్డ్ తెగల (ఎస్టీ) జాబితా లో ఉన్నారు. వీరికి చారిత్రాత్మకంగా, రాజకీయంగా తెలుగు రాష్ట్రాల్లో బలమైన వారస త్వం ఉంది. ఉమ్మడి వరంగల్, ఆదిలాబాద్, నల్లగొండ జిల్లాల్లో వీరి జనాభా ఎక్కువ. ఎన్నికల్లో వీరి ఓట్లు ఎంతో కీలకం. దామా షా ప్రకారం.. వీరు కూడా రాజకీయపరంగా ప్రాతినిధ్యం కోరుతుండటంతో కాలక్రమే ణా తెగ నుంచి రాజకీయాల్లోకి వచ్చే వారి సంఖ్య పెరుగుతూ వస్తున్నది.

1956లో అప్పటి ఉమ్మడి ఏపీ ప్రభుత్వం లంబాడీల ను షెడ్యూల్డ్ తెగగా గుర్తించింది. పలు డి మాండ్ల తర్వాత 1976లో తెలంగాణ లం బాడీలను ఎస్టీ జాబితాలో చేర్చారు. దీంతో ఆ తెగకు విద్య, రాజకీయాల్లో రిజర్వేషన్లు వ చ్చాయి. క్రమంగా రాజకీయాల్లోనూ వారికి భాగస్వామ్యం పెరిగింది. కర్ణాటక నాటి ముఖ్యమంత్రి డీ దేవరాజ్ ఉర్స్ ప్రభుత్వం లో మంత్రిగా, కేపీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన కేటీ రాథోడ్ వంటి లంబాడీ నాయకు లు ప్రభావవంతమైన వ్యక్తులుగా ఎదిగారు.

సిద్ధరామయ్య ప్రభుత్వంలో రుద్రప్పలమాని, పరమేశ్వర నాయక్ వంటి నాయకు లు మంత్రి పదవులు అలంకరించారు. ఈ పరిణామాలన్నీ రాజకీయాల్లో లంబాడీలకు పెరుగుతున్న పలుకుబడికి ప్రతిబింబాలు. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో.. తమను రాజకీయంగా నిర్లక్ష్యం చేస్తే అన్ని పార్టీలు తీవ్రంగా నష్టపోతాయని లంబాడీలు హెచ్చరిస్తున్నారు. లంబాడీ ఎమ్మెల్యేల్లో ఒకరికైనా మంత్రివర్గంలోనూ చోటు కల్పించాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.

కర్ణాటక రాజకీయాల్లో రాణింపు..

కర్ణాటకకు చెందిన లంబాడీలు తమ సామాజిక, రాజకీయ, ఆర్థిక వెనుకబాటుతనాన్ని పరిష్కరించుకునేందుకు ‘తండా డెవలప్‌మెంట్ బోర్డు’ సాధించుకున్నారు. తద్వారా వారికి సంక్షేమ పథకాలు చేరువయ్యాయి. అంతేకాదు.. రాజకీయపరం గానూ వారికి తగిన గుర్తింపు లభించింది. తెగకు చెందిన రేవు నాయక్ బెలంగీ 2008- 13 వరకు బీజేపీ ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.

రుద్రప్పలమాని 2013-19 వరకు సిద్ధరామయ్య ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో లంబాడీల మద్దతు కాం గ్రెస్ పార్టీకే లభించింది. బీజేపీ పెద్దలు సీట్ల కేటాయింపులో లంబాడీలకు తగిన ప్రాధా న్యం ఇవ్వకపోవడంతోనే వారు కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చినట్టు నివేదికల్లో తేలింది. సరైన అధ్యయనం లేకుండా రాజకీయ పార్టీలు రిజర్వేషన్ విధానాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాయని అక్కడి అఖిల భారత బంజా రా సేవా సంఘ్ నిరసన తెలిపింది. 

 తెగపై ప్రపంచీకరణ ప్రభావం..

1871 నాటి బ్రిటిష్ క్రిమినల్స్ ట్రైబ్స్ చట్టం అమలుతో లంబాడీలు సంచార జీవనం నుంచి స్థిర జీవితంలోకి వచ్చారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో లంబాడీలు వ్యవసాయ, భవన నిర్మాణ పనుల కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లేవారు. లంబాడీలపై రెండు దశాబ్దాల నుంచి ప్రపంచీకరణ ప్రభావం ఉంది. ఈ తెగలోనూ వరకట్నం వంటి గిరిజనేతర ఆచారాలు కొనసాగుతున్నాయి. ఎన్నో సవాళ్లు ఉన్నప్పటికీ లంబాడీ భాషను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రాథమిక పాఠశాల్లో లంబాడీ పాఠ్య పుస్తకాలను ప్రవేశపెట్టింది. అలా లంబాడీ సాంస్కృతిక విశిష్టతకు గుర్తింపు లభిస్తున్నది.