16-06-2025 12:35:16 AM
- బాసరలో తీవ్ర విషాదం
- మృతులంతా హైదరాబాద్ యువకులే
- శోకసముద్రంలో కుటుంబ సభ్యులు
- ఇసుకగుంతే ప్రమాదానికి కారణం!
నిర్మల్, భైంసా జూన్ 15( విజయక్రాంతి)/కుత్బుల్లాపూర్: నిర్మల్ జిల్లా సరస్వతి పుణ్యక్షేత్రమైన బాసర గోదావరిలో స్నానానికి వెళ్లిన ఐదుగురు యువకులు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో అమ్మవారి దర్శనానికి వచ్చిన వారు సరస్వతీ మాతను దర్శించుకోకుండానే అనంతలోకాలకు వెళ్లడంతో కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి.
బైంసా ఎస్పీ అవినాశ్కుమార్ తెలిపిన ప్రకారం హైదరాబాద్లోని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం చింతల్, కాచీగూడ ప్రాంతాలకు 30 మంది రాజస్థాన్ కుటుంబ సభ్యులు, మూడు వాహనాల్లో ఆదివారం ఉదయం సరస్వతి అమ్మవారిని దర్శించుకునేందుకు బాసరకు వచ్చారు. మొదట గోదావరిలో పుణ్య స్నానాలు చేసేందుకు గోదావరి వద్దకు వెళ్లారు. మహిళలు పుష్కర్ఘాట్ వద్ద స్నానాలు చేస్తుండగా, వారి కుటుంబ సభ్యులైన రాజేశ్(20), వినోద్ (19), హృతిక్ (20), మదన్ (18), భరత్ (20) అనే ఐదుగురు యువకులు గోదావరిలో స్నానం చేసేందుకు పుష్కర్ఘాట్ దాటి, బోటులో అవతలి వైపు వెళ్లారు. నీటిలో ఇసుక దిమ్మె ఉండటంతో అక్కడ స్నానాలు చేయాలని నిర్ణయించుకొని గోదావరి నదిలోకి దిగారు.
ముందుగా రాజేశ్ స్నానానికి దిగగా, ఇసుక దిమ్మెను ఆనుకొని నీటిలో లోతైన గుంత ఉండటంతో అందులో దిగిన అతను ఈత రాక మునిగిపోయాడు. అతన్ని కాపాడే క్రమంలో మిగతా నలుగురు కూడా ఒకరి వెంట ఒకరు నీటిలోకి దిగి గల్లంతయ్యారు. అవతలి వైపు ఉన్న కుటుంబ సభ్యులు చూసి కేకలు వేయటంతో అక్కడ ఉన్న కొంతమంది ఈతగాళ్లు గాలింపు చేపట్టారు. విషయం తెలుసుకున్న బాసర పోలీసులు, గోదావరి వద్దకు వెళ్లి గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాలను బయటకు తీశారు. అక్కడి నుంచి బైంసా ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ జానకీ షర్మిల, ముథోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ముగ్గురు అన్నదమ్ములు..
నీట మునిగిన ముగ్గురిలో భరత్, మదన్, రాజేశ్ ముగ్గురు అన్నదమ్ములు. అమ్మతో కలిసి బాసరకు వచ్చిన ఈ ముగ్గురు అనుకోని దుర్ఘటనలో గోదావరి నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోవడంతో ఆ తల్లి దిగ్భ్రాంతికి లోనైంది. మిగతా ఇద్దరూ వినోద్, రుతిక్ వారికి సమీప బంధువులే. మరణించిన యువకులంతా 20 ఏండ్ల లోపువారే కావడం విషాదకరం. గోదావరిలో హెచ్చరిక బోర్డులు లేకపోవడం వల్లే తమ పిల్లలు చనిపోయారని, దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని మృతుల తల్లిదండ్రులు, బంధువులు డిమాండ్ చేశారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను హైదరాబాద్కు తరలించారు.
భక్తుల్లో ఆందోళన..
గోదావరిలో తరుచు ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవ డంపై భక్తుల్లో ఆందోళన నెలకొంది. గోదావరి పుష్కర ఘాట్ల వద్ద స్నానాలు చేసే ప్రదేశంలో ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టకపోవడం, హెచ్చరిక బోర్డులు లేకపోవడం వల్ల తరచుగా ఇలాంటి ఘటనలు చోటుచేసుకొని, భక్తులు ప్రాణాలు కోల్పోతున్నారని స్థానికులు వాపోతున్నారు.