10-06-2025 10:07:25 PM
జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి..
నల్లగొండ టౌన్ (విజయక్రాంతి): పాఠశాల విద్యను పటిష్ట పరచడంలో భాగంగా విద్యార్థుల నమోదుపై దృష్టి కేంద్రీకరించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి(District Collector Ila Tripathi) అన్నారు. మధ్యలో బడి మానేసే వారి శాతాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని, ఈ విషయంలో మండలాల ప్రత్యేక అధికారులు సైతం ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలన్నారు. ప్రతి పాఠశాల వారిగా గత సంవత్సరం విద్యార్థుల నమోదు, ఈ సంవత్సరం విద్యార్థుల నమోదుపై నివేదిక సమర్పించాలని, అలాగే ప్రతి కేజీబీవీ, వారీగా విద్యార్థుల నమోదు వివరాలను సమర్పించాలన్నారు. మంగళవారం ఆమె ఉదయాదిత్య భవన్లో విద్యాశాఖ అధికారులతో పాటు, మండలాల ప్రత్యేక అధికారులతో విద్యాశాఖ కార్యక్రమాలపై సమీక్షించారు.
పాఠశాలల పునఃప్రారంభం విద్యార్థుల నమోదు, టీచర్లు, తల్లిదండ్రుల సమావేశాలు, మధ్యాహ్న భోజనం, విద్యార్థుల యూనిఫామ్, భవిత కేంద్రాల సంసిద్ధత, మధ్యలో బడి మానేసేవారు, తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. భవిత కేంద్రాలలో అన్ని సౌకర్యాలను మరోసారి పరిశీలించాలని, మండల ప్రత్యేక అధికారులను ఆదేశించారు. 12న పాఠశాలల పునః ప్రారంభం సందర్భంగా 12 ,13 న టీచర్లు,తల్లిదండ్రుల మెగా సమావేశాలు నిర్వహించాలని, ఈ కార్యక్రమానికి స్థానిక ప్రజా ప్రతినిధులను భాగస్వామ్యం చేయాలన్నారు.
అలాగే విద్యార్థులు మధ్యలో బడి మానేయకుండా చర్యలు చేపట్టాలని, పాఠశాల సెలవుల తర్వాత చాలా మంది బడి మానేసేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయని, అలా జరగకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకుని అందరూ తిరిగి బడిలో చేరే విధంగా చూడాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రతి పాఠశాలలో రెండు రోజుల పాటు పారిశుద్ధ్య డ్రైవ్ నిర్వహించాలని జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్య ను ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రాలలో స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ ను నిర్వహించాలని చెప్పారు .రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇన్చార్జ్ కలెక్టర్ నారాయణ అమిత్, డీఈఓ బిక్షపతి, దేవరకొండ ఆర్డిఓ రమణారెడ్డి, ఎం ఈ వోలు, మండలాల ప్రత్యేక అధికారులు తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.