26-12-2025 10:23:21 AM
మేడిపల్లి,(విజయక్రాంతి): గంజాయి విక్రయిస్తున్న నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసిన ఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం....గురువారం రాచకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని మేడిపల్లి పోలీసులతో కలిసి ఈగల్ ఫోర్స్, ఆర్.ఎన్.పి.ఎస్ బృందం నిర్వహించిన ఆపరేషన్లో గుండ్ల పృథ్వీరాజ్, టి. రాహుల్, మహ్మద్ అక్రమ్, అబ్దుల్ షఫీ లను అరెస్ట్ చేసి 3 కిలోల గంజాయి,4 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.చెంగిచర్ల కు చెందిన పృథ్వీరాజ్ (27) గతంలో కుట్టు దారాల తయారీ వ్యాపారం చేసేవాడు.కానీ కోవిడ్ వల్ల అది ఆగిపోవడంతో డ్రైవర్గా మారాడు.
ఆ సమయంలో గంజాయి వినియోగదారులతో ఏర్పడిన పరిచయాలతో, సులభంగా డబ్బు సంపాదించడానికి ఒడిశా నుండి గంజాయిని తెచ్చి హైదరాబాద్లో అమ్మడం ప్రారంభించాడు.గతంలో ఉప్పల్ ఎక్సైజ్, చాదర్ఘాట్ పోలీసులకు పట్టుబడి జైలుకు వెళ్లినప్పటికీ, తిరిగి విడుదలయ్యాక ఒడిశాకు చెందిన జశ్వంత్ అనే వ్యక్తితో కలిసి మళ్ళీ దందాను మొదలుపెట్టాడు. ఈ క్రమంలో ముగ్గురిని తన అనుచరులుగా చేర్చుకుని,కిలోకు రూ.10,000 చొప్పున కమిషన్ ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నాడు.అబ్దుల్ షఫీ విజయనగరం వెళ్లి ఒడిశాకు చెందిన జశ్వంత్ దగ్గర 5 కిలోల గంజాయిని సేకరించాడు.
ఆ గంజాయిని అక్రమ్కు అప్పగించగా, అతను 1.5 కిలోలు తన దగ్గర పెట్టుకొని మిగిలిన 3.5 కిలోలను రాహుల్కు ఇచ్చాడు.అక్రమ్ తన నారపల్లిలోని పాన్ షాపును అడ్డుపెట్టుకుని చిన్న చిన్న ప్యాకెట్లుగా గంజాయిని విక్రయించేవాడు.డిసెంబర్ 18న కొంత గంజాయిని విక్రయించగా, మిగిలిన 3 కిలోలను గురువారం విక్రయించడానికి ప్రయత్నిస్తుండగా పోలీసులు వీరిని పట్టుకొని కేసు నమోదు చేసామని, మాదకద్రవ్యాలను విక్రయిస్తున్నట్టు సమాచారం తెలిసిన లీగల్ ఫోర్స్ కు తెలియ చేయడానికి టోల్ ఫ్రీ నెంబర్ 1908కి కాల్ చేసి సమాచారం ఇవ్వగలరని పోలీసులు తెలిపారు.