11-06-2025 01:48:13 PM
తెలంగాణ రాష్ట్రీయ విద్యార్థి సేన పరిషత్(TRVSP) రాష్ట్ర అధ్యక్షులు బంటు సందీప్
పెన్ పహాడ్: పెంచిన బస్ పాస్ ధరలను వెనక్కి తీసుకుని, విద్యార్థులకు ఉచిత బస్సుపాసులు అందింది ఆడుకోవాలని టీఆర్వీఎస్పీ(Telangana Rashtra Vidyarthi Sena Parishad) రాష్ట్ర అధ్యక్షులు బంటు సందీప్ పేర్కొన్నారు. బుధవారం సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడుతూ... తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న బస్ పాస్ చార్జీల పెంపు నిర్ణయం ద్వారా విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తనున్నాయన్నారు.
ఈ నెల 12 నుంచి పాఠశాలలు, కళాశాలలు రీ ఓపెన్ అవుతున్న సందర్భంగా బస్ పాస్ చార్జీలు పెంచి విద్యార్థులను రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులకు గురి చేసేలా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. పట్టణంలో ఎక్స్ ప్రెస్ లో సాధారణ నెల పాస్ లు రూ. 300 నగరంలో విద్యార్థులకు పాస్ రూ. 400, ఉంటే దాన్ని రూ. 600 కు పెంచారన్నారు. మూడు నెలల బస్సు పాస్ రూ.1200 నుండి రూ. 1800 కు పెంచడం అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 11 లక్షల విద్యార్థులపై అదనపు భారాన్ని మోపడమే అవుతుందన్నారు.
పట్టణంలో, నగరాల్లో ఉదయం, నుంచి సాయంత్రం వరకు రద్దీ ఎక్కువగా ఉండటం వల్ల తలెత్తుతున్న ఇబ్బందుల్ని అధిగమించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పడం సిగ్గుచేటు అన్నారు. బస్సులను పెంచమంటే బస్ చార్జీలు పెంచడం ప్రభుత్వ నీతిమాలిన చర్య అని అన్నారు. పెంచిన అన్ని రకాల చార్జీలను వెంటనే తగ్గించాలని, తెలంగాణ రాష్ట్రంలో ప్రతి విద్యార్థికి ఉచిత బస్ ప్రయాణం కల్పించాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.