రెడ్లకుంట గ్రామంలో ఉచిత కంటి వైద్య శిబిరం
కోదాడ, ఆగస్టు 10 : మండలంలోని రెడ్లకుంట గ్రామంలో పుల్లూరు కంటి హాస్పిటల్ డాక్టర్ బిట్టు మల్లీశ్వరి సహకారంతో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని సర్పంచ్ పొలంపల్లి కుటుంబరావు సోమవారం ప్రారంభించారు.ఈ సందర్భంగా సర్పంచ్ పొలంపల్లి కుటుంబరావు మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన కంటి వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించినట్లు తెలిపారు.
ఉచిత కంటి పరీక్షలు అందించడంలో సహకరించిన పుల్లూరు కంటి హాస్పిటల్ యాజమాన్యానికి, డాక్టర్ బిట్టు మల్లీశ్వరికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. గ్రామంలోని ప్రజలందరూ తమ కంటి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించి, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
ఈ వైద్య శిబిరంలో రెడ్లకుంట గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కంటి పరీక్షలు చేయించుకున్నారు. వైద్య నిపుణులు రోగులను పరిశీలించి, అవసరమైన వారికి ఉచితంగా మందులు మరియు తగిన సలహాలు అందించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ ప్రతినిధులు, గ్రామ పెద్దలు, యువకులు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.






