ఆర్థిక స్వావలంబన సాధించాలని ఎస్పీ నితికా పంత్
ఆదివాసీ మహిళలకు ఉచిత కుట్టు మిషన్ శిక్షణ ప్రారంభం
కుమ్రం భీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): జైనూర్ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ సమీపంలో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో “పోలీసులు మీకోసం” కార్యక్రమం భాగంగా వసుధ ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థ సహకారంతో ఆదివాసీ మహిళలకు ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ నితికా పంత్ ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మహిళలు ఇలాంటి శిక్షణ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకొని స్వయం ఉపాధి ద్వారా ఆర్థికంగా ఎదగాలని సూచించారు.
ఇతరులపై ఆధారపడకుండా తమ కుటుంబాలను పోషించుకునే సామర్థ్యం సాధించడానికి ఇది మంచి అవకాశం అని పేర్కొన్నారు. మహిళలు స్వావలంబనతో సమాజంలో గౌరవప్రదమైన స్థానం పొందాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమానికి సహకరించిన వసుధ ఫౌండేషన్కు ఎస్పీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జైనూర్ సీఐ రమేష్, ఎస్సైలు రవి కుమార్, విక్రమ్, గ్రామ సర్పంచ్ కొడప ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.






