calender_icon.png 2 February, 2026 | 3:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నైరాశ్యం నుంచి సన్యాసం వైపు!

16-02-2025 12:00:00 AM

జీవితంపై విరక్తో, ఆధ్యాత్మిక తన్మయత్వమో.. కారణాలు ఏమైనా సన్యానం వైపు అడుగులు వేసే మహిళల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. ఇందుకు కుంభమేళా వేదికవుతోంది. ప్రస్తుతం జరుగుతున్న మహా కుంభమేళాలో 7,000 మందికి పైగా మహిళలు సన్యాసం స్వీకరించి ఆధ్యాత్మికతవైపు అడుగులు వేశారు. సన్యానం తీసుకున్నవారిలో విద్యావంతులు, మేధావులు, అందమైన అందెగత్తెలు ఉండటం పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కుటుంబంలో కలతలు,  ప్రపంచం పట్ల విరక్తి, ఆధ్యాత్మిక అనుభూతి ప్రధాన కారణాలు అని ఆయా మఠాల స్వామిజీలు అభిప్రాయపడుతున్నారు. ఇదే విషయమై మహిళా సన్యాసిని దివ్య గిరి మాట్లాడుతూ ‘ఈసారి దీక్ష తీసుకుంటున్న మహిళల్లో ఉన్నత విద్యావంతుల సంఖ్య ఎక్కువగా ఉంది. ఆధ్యాత్మిక అనుభూతి కోసం సన్యాసం స్వీకరిస్తున్నారు’ అని చెప్పిందామె. రాధేనంద్ భారతి అనే సాద్వీ స్పందిస్తూ.. ‘నా తండ్రి వ్యాపారవేత్త. ఇంట్లో అన్నీ ఉన్నప్పటికీ ఆధ్యాత్మిక అనుభూతి కోసం ఇల్లు వదిలి సన్యాసం స్వీకరించా. గత పన్నెండు సంవత్సరాలుగా గురువు సేవలో ఉన్నా’ చెప్పింది. అలాగే తాజాగా బాలీవుడ్ నటి, మాజీ మిస్ ఇండియా ఇషికా తనేజా కూడా అదే మార్గాన్ని ఎంచుకుంది. మహాకుంభమేళాలో పవిత్ర జలాల్లో స్నానం చేసి సన్యాసం పుచ్చుకుంది. ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకున్న ఈ మాజీ మిస్ ఇండియా.. పొట్టి దుస్తుల్లో మహిళలు డ్యాన్స్ చేయకూడదని బోధించింది. మిస్ ఇండియా, మిస్ వరల్ టైటిళ్ల వల్ల పేరు ప్రఖ్యాతలు లభించినా.. జీవితం మాత్రం పరిపూర్ణమైన ఫీలింగ్ కలగలేదని, అదే భక్తి మార్గాన్ని ఎంచుకున్నాక ఆ సంతృప్తి దొరికిందని తెలిపింది. అలాగే 90వ దశకంలో బాలీవుడ్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్న నటి మమతా కులకర్ణి 2003 తర్వాత సినిమాల నుంచి తప్పుకొని, విదేశాలకు వెళ్లిపోయారు. అయితే చాలా రోజుల తర్వాత కుంభమేళాలో ప్రత్యక్ష్యమై సాధ్వీగా అందరినీ ఆశ్చర్యపర్చిన విషయం తెలిసిందే.