బడ్జెట్లో మైనారిటీ సంక్షేమానికి నిధులు కేటాయించాలి
స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ తెలంగాణ
ముషీరాబాద్, మార్చి 5 (విజయక్రాంతి): రాబోయే తెలంగాణ బడ్జెట్ 2026 విద్యా, మైనారిటీ సంక్షేమానికి అధిక నిధులను కేటాయించి పూర్తి స్థాయిలో వినియోగించాలని స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్(ఎస్ఐఓ) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. విద్యా రంగంలో ఉన్న లోపాలను సరిదిద్దడానికి నిర్ణయాత్మక విధానాలను రూపొందించాలని కోరింది.
ఈ మేరకు గురువారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్ఐఓ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు మహ్మద్ ఫరాజ్ అహ్మద్ మాట్లాడుతూ గత బడ్జెట్లలో విద్య, మైనారిటీ సంక్షేమానికి నిధులు కేటాయించినప్పటికీ పూర్తి గా ఖర్చు చేయలేదని అన్నారు. పెండింగ్ స్కాలర్షిప్ విడుదల చేయాలని, విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రైవేట్ పాఠశాలల్లో పేద విద్యార్థులకు లభించే 25 సీట్లు కేటాయించాలని కోరారు.
డిఎస్సి-24లో ప్రకటిం చిన1,183 ఉర్దూ పోస్టుల్లో కేవలం 517 మాత్రమే భర్తీ చేస్తున్నారని, మిగిలిన 666 ఖాళీలను కూడా నింపాలని పేర్కొన్నారు. యూనివర్సిటీలలో ఫ్యాకల్టీ కొరత ఉందని, ఖాళీలు భర్తీ చేయాలని అన్నారు. మైనారిటీ డిక్లరేషన్ లో ఇచ్చిన హామీల మేరకు, మైనారిటీ విద్యార్థుల విద్యాభివృద్ధికి, యువత సాధికారతకు కేటాయించిన బడ్జెట్ పరిపాలనా పరమైన అడ్డంకులు లేకుండా ఖర్చు చేయాలని కోరారు.




