04-10-2025 12:00:00 AM
కలెక్టర్ ఆశిష్ సంగువాన్
కామారెడ్డి, అక్టోబర్ 3 (విజయక్రాంతి): మహాత్మా గాంధీ చూపిన ఆశయాలు అందరికీ స్ఫూర్తిదాయకమని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగువాన్ అన్నారు. అహింసా, శాంతి మార్గం ద్వారానే సమాజంలో ఉన్న సమస్యలు, విభేదాలు, వత్తిడులను అధిగమించొచ్చని ఆయన తెలిపారు.
గురువారం మార్కెట్ యార్డ్ గంజిలో గాంధీ విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మాట్లాడుతూ దేశానికి స్వాతంత్య్రం తీసుకువచ్చిన మహాత్మా గాంధీ కేవలం స్వాతంత్య్ర సమరయోధుడు మాత్రమే కాక, అహింసా సిద్ధాంత పితామహుడని, ఆయన ఆశయాలు ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విక్టర్, తహసిల్దార్ జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు.
పెద్ద కొడప్గల్లో..
పెద్ద కొడప్గల్, అక్టోబర్ 3 (విజయ క్రాంతి): జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా గురువారం కాంగ్రెస్ పార్టీ నేతలు ఘనంగా నివాళులర్పించారు. గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఆయనను స్మరించారు. ఈ సందర్భంగ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మహేందర్ రెడ్డి మాట్లాడుతూ, గాంధీజీ చూపిన సత్యం, అహింస, శాంతి మార్గమే దేశానికి దారి చూపుతుందని పేర్కొన్నారు.
ఆ మహాత్మా జయంతి సందర్భంగా హృదయపూర్వకంగా నివాళులు అర్పించామని స్వాతంత్ర పోరాటంలో మహాత్మ గాంధీ చేసిన ఎనలేని కృషిని మరిచిపోలేమని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పి. మహేందర్ రెడ్డి, సీనియర్ నాయకులు, చిప్ప మోహన్, పి నాగిరెడ్డి, బస్వరాజ్ దేశాయి, అక్కలి సాయి రెడ్డి, ఎస్. మధు, సయ్యద్ ఫిరోజ్, బి, నాగరాజ్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
తాడ్వాయిలో..
తాడ్వాయి, అక్టోబర్ 3 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలో గురువారం గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వివిధ పార్టీలకు చెందిన నాయకులు గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా నాయకులు పేదలకు పండ్లు పంపిణీ చేశారు. మండలంలోని ఎర్ర పహాడ్, దేమికలాన్, తాడువాయి, నందివాడ, బ్రాహ్మణపల్లి, కృష్ణాజివాడి, చిట్యాల, సంతాయిపేట గ్రామాలలో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. నాయకులు శ్యామ్ రా వు, సంజీవులు, మహేందర్ రెడ్డి,నర్సారెడ్డి, మోహన్ రెడ్డి పాల్గొన్నారు.