3 March, 2026 | 2:35 AM

మదర్ డెయిరీకి పూర్వ వైభవం తెస్తాం

03-03-2026 12:46 AM

‘నార్ముల్’ చైర్మన్ గుడిపాటి మధుసూదన్‌రెడ్డి 

నేడు హయత్‌నగర్‌లోని ప్రధాన కార్యాలయంలో సర్వసభ్య సమావేశం 

హాజరుకానున్న ప్రభుత్వ విప్ ఐలయ్య, ఎంపీ చామల

ఎల్బీనగర్, మార్చి 2: నల్లగొండ, -రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయక సహకార యూనియన్ లిమిటెడ్ (నార్ముల్) డెయిరీకి ఎన్డీడీబీ సహకారంతో త్వరలోనే పూర్వ వైభవం తీసుకొస్తామని చైర్మన్ గుడిపాటి మధుసూదన్‌రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. ‘నార్ముల్ బోర్డు’ డైరెక్టర్లతో కలిసి హయత్‌నగర్‌లోని ప్రధాన కార్యాలయంలో సోమవారం ఆయన మాట్లాడారు. 

 సంస్థను గట్టెకించాలని సీఎం రేవంత్‌రెడ్డిని సంప్రదించామని, దీనిపై సీఎం స్పందిస్తూ నార్ము ల్ డెయిరీ మాక్స్ చట్టం పరిధిలో ఉందని, ఆ చట్టం బైలాస్ ప్రకారం కో ఆపరేటివ్ సంస్థలకు ప్రభుత్వం నుంచి నిధులను ఇవ్వ లేమని చెప్పారని తెలిపారు. కానీ, సంస్థను నష్టాల నుంచి బయట పడేసేందుకు గతం లో సంస్థను లాభాల బాటలో నడిపించిన ఎన్డీడీబీతో కుదుర్చుకునే ఒప్పందానికి సంపూర్ణ సహకారం అందిస్తామని సీఎం హామీ ఇచ్చారని వివరించారు.

ఈ మేరకు రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి, ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐల య్య, విజయ డెయిరీ చైర్మన్ గుత్తా అమిత్‌రెడ్డితో కూడిన బృందంతో కలిసి రెండు రోజుల కిందట ఎన్డీడీబీ చైర్మన్ మీనేష్ సీషా, ఎండీఐఎల్ ప్రతినిధులతో చర్చించినట్టు తెలిపారు. స్పందించిన ఎన్డీడీబీ చైర్మన్ మీనేశ్  తక్షణ సాయంగా రూ.10 కోట్లు విడుదల చేస్తామని హామీ ఇచ్చారన్నారు. మంగళవారం జరగనున్న నార్ముల్ సర్వసభ్య సమావేశంలో ఎన్డీడీబీ ఒప్పందం వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. నార్ముల్ ఎండీ లింగారెడ్డి, బోర్డు డైరెక్టర్లు జయశ్రీ, ఉప్పల్ వెంకట్‌రెడ్డి, జలందర్‌రెడ్డి, అలివేలు రంగారెడ్డి, పుప్పాల నర్సిం హులు, కస్తూరి పాండు, సందిల భాస్కర్‌గౌడ్  పాల్గొన్నారు.