08-06-2025 12:00:00 AM
నటి అనంతిక సనీల్కుమార్ ప్రధాన పాత్రలో నటించిన తాజాచిత్రం ‘8 వసంతాలు’. హనురెడ్డి, రవితేజ దుగ్గిరాల, సంజన, కన్నా, స్వరాజ్ రెబ్బా ప్రగడ, సమీరా కిషోర్ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వం వహించగా.. మైత్రిమూవీమేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఫస్ట్ టీజర్తో సినీప్రియుల్లో ఆసక్తిని రేకెత్తించిన ఈ చిత్రబృందం తాజాగా సెకండ్ టీజర్ను రిలీజ్ చే అంచనాలను మరింతగా పెంచేశారు.
ఈ టీజర్ కవితాత్మక సన్నివేశంతో ప్రారంభమవుతుంది. వర్షంలో తడిసిన అనంతిక ఊటీకి వచ్చిన కొత్త తెలుగు రచయిత సంజయ్ను గమనిస్తుంది. ‘అతను పదాలను ప్రేమతో రాస్తే తడిసిన గులాబీ పువ్వుల్లా ఉంటాయి.
అదే కసితో రాస్తే పిన్ తీసిన గ్రెనేడ్లా ఉంటాయి’ అనే వాయిస్ సంజయ్ పాత్రను ప్రజెంట్ చేసింది. ‘అమ్మాయిలకు కత్తి పట్టుకుని రౌద్ర రసం చూపేవాడికంటే కన్నీళ్లు తుడుస్తూ కరుణ రసం చూపించేవాడంటేనే ఇష్టం’ అనే డైలాగ్ యూనివర్సల్గా కనెక్ట్ అయ్యేలా ఉంది.
‘ప్రేమ చేరుకోవడానికి ఒక గమ్యం కాదు, మనం చేయాల్సిన ప్రయాణం’ అనే హార్ట్ టచ్చింగ్ లైన్తో టీజర్ ముగుస్తుంది. జూన్ 20న థియేటర్లలో విడుదల కానున్న ఈ చిత్రానికి సంగీతం: హేషమ్ అబ్దుల్ వహాబ్; డీవోపీ: విశ్వనాథ్రెడ్డి; ఎడిటర్: శశాంక్ మాలి; యాక్షన్ కొరియోగ్రఫీ: వింగ్ చున్ అంజి.