డేటింగ్ యాప్లతో అమ్మాయిల వల
కేసు నమోదు చేసిన మాదాపూర్ పోలీసులు
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 7 (విజయక్రాంతి) : కొందరు యువతులు పబ్ నిర్వాహకులతో కలిసి ఆన్లైన్ డేటింగ్ యాప్లతో పలువురిని మోసం చేసి వేలల్లో బిల్లులు కట్టిస్తున్న వారిపై మాదాపూర్ పోలీసులు శుక్రవారం సుమోటోగా కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. సిటీలో డేటింగ్ యాప్లో పరిచయమవుతున్న యువతులు, యువకులను హైటెక్ సిటీలోని ఓ పబ్కి తీసుకెళ్తున్నారు. అక్కడ ఖరీదైన మద్యం, ఇతర ఆహార పదార్థాలు ఆర్డర్ చేసి యువతులు అక్కడి నుంచి నెమ్మదిగా జారుకుంటున్నారు.
ఈ క్రమంలో ఇప్పటి వరకు 8 మంది బాధితులుగా మారినట్లు తెలుస్తోంది. యాప్ల్లో పరిచమైన వారు కలుద్దామని బుట్టలో పడేసి పబ్లోకి తీసుకెళ్తున్నారు. గంటలో రూ. 40 వేల వరకు బిల్ చేసి జారుకుంటున్నారు. విషయం తెలుసుకునేలోపే బిల్ కట్టాలని ఆ యువకులపై పబ్ యాజమాన్యం ఒత్తిడి తెస్తోంది. దీంతో తాము కూడా బాధితులమేనంటూ పలువురు ముందుకు వస్తున్నారని పోలీసులు తెలిపారు. ఇలా మోసపోయిన ఓ వ్యాపారవేత్త సోషల్ మీడియా వేదికగా ఆధారాలతో సహా పోస్ట్ చేయడంతో ఈ పబ్ తతంగం వెలుగులోకి వచ్చింది.






