11-12-2025 12:51:28 AM
హైదరాబాద్, డిసెంబర్ 10 (విజయక్రాంతి) : పెట్టుబడుల కట్టుకథలు చెప్పి, కోట్లు ఖర్చు చేసి గ్లోబల్ సమ్మిట్ అట్టర్ ఫ్లాప్ చేశారని మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు. విజన్ డాక్యుమెంట్లో విజన్ లేదు, దాన్ని చేరుకునే మిషన్ లేదని, అది విజన్ డాక్యుమెంట్ కాదు.. విజన్ లెస్ డాక్యుమెంట్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశా రు. క్యూర్, ప్యూర్, రేర్ అంటూ అంటున్న రేవంత్ రెడ్డి.. తెలంగాణను కొల్లగొడుతున్న చోర్ అంటూ ఫైర్ అయ్యారు.
గ్లోబల్ సమ్మిట్లో ఎంవోయూల వెనుక చీకటి ఒప్పందా లు, అంకెల గారడీ తప్ప ప్రజలకు పనికొచ్చే పనులు ఏవీ లేవు అని మండిపడ్డారు. రెండేళ్లుగా కోట్లు ఖర్చు చేసి సీఎం రేవంత్రెడ్డి తిరిగిన దేశా లు, నిర్వహించిన సమ్మిట్స్ ద్వారా మొత్తం ఎన్ని కోట్ల పెట్టుబడులు వచ్చాయి, అందులో ఎన్ని కంపెనీలు గ్రౌండ్ అయ్యాయి, ఎంత మంది తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు వచ్చాయో దమ్ముంటే శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశా రు.
ఈ మేరకు బుధవారం సీఎం రేవంత్ రెడ్డికి హరీశ్ రావు బహిరంగ సవాల్ విసిరారు. కేసీఆర్ పాలనలో జరిగిన అభివృద్ధి గురించి గ్లోబల్ సమ్మిట్ వేదికగా టోనీ బ్లెయిర్, సుబ్బారావు ఇచ్చిన కితాబు రేవంత్ రెడ్డికి చెంపపెట్టు అని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి నిర్వహించింది గ్లోబల్ సమ్మిట్ లాగా లేదు, భూములు అమ్ముకునేందుకు ఏర్పాటు చేసిన రియల్ ఎస్టేట్ ఎక్స్ పో లాగా ఉందని విమర్శించారు.
రేవంత్రెడ్డి ప్రభుత్వం అంతర్జాతీయ స్థాయిలో పరువు పోగొట్టుకున్నదని ఎద్దేవా చేశారు. వైఫల్యాల నుంచి దృష్టి మరల్చడానికి రేవంత్ రెడ్డి చేసిన పీఆర్ స్టంట్ గ్లోబల్ సమ్మిట్ అని తెలిపారు. గ్లోబల్ సమ్మిట్ పేరిట రియల్ ఎస్టేట్ స్కాముకు తెరతీశారని ఆరోపించారు.