నేడు గో డిజిట్ ఐపీవో లిస్టింగ్
23-05-2024 12:05 AM
ముంబై, మే 22: స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి, ఆయన సతీమణి, సినీనటి అనుష్క శర్మలకు పెట్టుబడులు ఉన్న డిజిటల్ ఇన్సూరెన్స్ కంపెనీ గో డిజిట్ జనరల్ ఇన్సూరెన్స్ షేర్లు స్టాక్ ఎక్సేంజీల్లో మే 23న లిస్టవుతాయి. ఈ కంపెనీ జారీచేసిన ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) 10 రెట్లు ఓవర్ సబ్స్క్రయిబ్ అయ్యింది. ఐపీవోలో 5.28 కోట్ల షేర్లను కంపెనీ జారీచేస్తుండగా, 50.70 కోట్ల షేర్లకు బిడ్స్ అందాయి. రూ.2,615 కోట్ల సమీకరణకు వచ్చిన ఈ ఐపీవో ద్వారా కంపెనీ రూ. 1,125 కోట్ల విలువైన 4.14 కోట్ల షేర్లను తాజా ఈక్విటీగా జారీచేస్తుండగా, ప్రస్తుత ఇన్వెస్టర్లు ఆఫర్ ఫర్ సేల్ రూపంలో రూ.1,489 కోట్ల విలువైన షేర్లను విక్రయి స్తున్నారు. ఐపీవో ధరను రూ.272గా నిర్ణయించారు. రిటైల్ విభాగంలో 4.27 రెట్లు స్పందన లభించింది.






