పేదలకు ఆర్థిక భారాన్ని తగ్గించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం
* లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే రోహిత్
* అనంతరం ఆయా గ్రామాల్లో నూతన బోరు మోటార్ల ప్రారంభం
పాపన్నపేట,సెప్టెంబర్02: సంక్షేమ పథకాల ద్వారా పేద కుటుంబాల ఆర్థిక భారాన్ని తగ్గించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ (Mynampally Rohit)పేర్కొన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయ(MPDO Office) మీటింగ్ హాలులో లబ్ధిదారులకు నూతన స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. అనంతరం ఆయా గ్రామాల్లో నూతనంగా వేసిన బోరు బావుల్లో బోరు మోటార్లను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదల సామాజిక గౌరవానికి నూతన రేషన్ కార్డు ప్రతీకగా నిలుస్తుందన్నారు. రేషన్ కార్డులు లేని కారణంగా అర్హులైన పేదలు సన్న బియ్యం పథకానికి దూరం కావద్దనే ఉద్దేశంతో ప్రజా ప్రభుత్వం నూతన కార్డుల(New cards)ను మంజూరు చేస్తుందన్నారు. సన్న బియ్యం కొనుగోలు చేయడం పేద కుటుంబాలకు భారంగా మారిందని, రేషన్ దుకాణాల ద్వారా సన్న బియ్యం అందించడంతో ఆ కుటుంబాలకు ఆర్థిక వేసులుబాటు కలుగుతోందని పేర్కొన్నారు.
ఈ కార్డుతో వివిధ ధ్రువపత్రాల జారి, ఆరోగ్య శ్రీ(Aarogya Sri) తదితర అవసరాలకు కూడా ఉపయోగపడుతుందన్నారు. కార్డులు రాని అర్హులకు రానున్న రోజుల్లో అందించనున్నట్లు తెలిపారు. వివిధ సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు ప్రత్యక్ష ప్రయోజనం చేకూర్చడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షులు నరేందర్ గౌడ్, నాయకులు ప్రశాంత్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, గోవింద్ నాయక్, ఆయా గ్రామాల సర్పంచులు, మండల నాయకులు, కార్యకర్తలు, ఆయా శాఖల అధికారులున్నారు.






