01-05-2025 05:10:28 PM
హైదరాబాద్,(విజయక్రాంతి): శంషాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA)లో భారీగా బంగారం పట్టుబడింది. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులు తనిఖీలు నిర్వహించారు. నిర్దిష్ట నిఘా సమాచారం మేరకు డీఆర్ఐ అధికారులు ఆర్జీఐఏ అంతర్జాతీయ ప్రయాణీకుల రాక ద్వారం వద్ద ఉన్న ఏరోబ్రిడ్జ్ సమీపంలో విమానాశ్రయంలో పనిచేసే గ్రౌండ్ హ్యాండ్లింగ్ సిబ్బందితో పాటు దుబాయ్ నుండి మస్కట్ మీదుగా హైదరాబాద్కు వచ్చిన ఓ భారతీయ ప్రయాణీకుడిని తనిఖీ చేసి 3.5 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. విదేశీ మూలాల అక్రమ రవాణా బంగారాన్ని ప్రయాణీకుడు ఏరో బ్రిడ్జి దగ్గర గ్రౌండ్ హ్యాండ్లింగ్ సిబ్బందికి అప్పగిస్తున్నాడు.
అక్రమ రవాణా బంగారాన్ని విమానాశ్రయం వద్ద పార్కింగ్ ప్రాంతం దగ్గర వేచి ఉన్న మరొక గ్రౌండ్ సిబ్బందికి డెలివరీ చేయాల్సి ఉందని దర్యాప్తులో తేలింది. పార్కింగ్ వద్ద వేచి ఉన్న రెండవ గ్రౌండ్ స్టాఫ్, కస్టమ్స్ ప్రాంతం నుండి బయటకు వచ్చిన తర్వాత విమానాశ్రయం వెలుపల బంగారాన్ని అదే ప్రయాణీకుడికి తిరిగి ఇచ్చేవాడు. మూడు ప్యాకెట్లలో దాచిపెట్టిన 10 తులాల బరువున్న మొత్తం 30 బంగారు కడ్డీలను ప్రయాణీకుడి నుండి స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన బంగారం విలువ బహిరంగ మార్కెట్లో సూమారుగా రూ.3.45 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ప్రయాణికుడితో పాటు గ్రౌండ్ హ్యాండ్లింగ్ సిబ్బంది ఇద్దరిని కస్టమ్స్ చట్టం-1962 నిబంధనల కింద అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.