01-05-2025 04:30:50 PM
హైదరాబాద్,(విజయక్రాంతి): భారతదేశాన్ని 60 ఏళ్ల పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ దేశంలో ఏనాడు జనగణనలో కులగణన చేపట్టలేదని, రూ.వేల కోట్లు దుర్వినియోగం చేసిందని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు డా.లక్ష్మణ్ పేర్కొన్నారు. బీసీల హక్కులను కాలరాయడం, బీసీల రిజర్వేషన్లను అణచివేయడమే కాంగ్రెస్ చరిత్ర అని విమర్శించారు. కానీ నేడు బీజేపీ ప్రభుత్వం మాత్రం జనగణనలో కులగణనను కూడా జరిపించడానికి సిద్ధంగా ఉందని, దీంతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశానికి అభినవ అంబేద్కర్గా నిలిచారని లక్ష్మణ్ కొనయాడారు. శాస్త్రీయ పద్ధతిలో అన్ని కులాల వివరాలు సేకరించి, వారి సంక్షేమం కోసం ప్రణాళికలు రూపొందించాలన్న ఉద్దేశంతో కులగణన నరేంద్ర మోదీ చేపట్టనున్నారని చెప్పారు. కులగణన వివరాలు కాంగ్రెస్ ప్రభుత్వాలు చెప్పడం లేదని, తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్వహించిన కులగణనలాగా రహస్యంగా చేయాలని కేంద్రానికి సూచిస్తున్నారా అని మండిపడ్డారు.