ముస్లిం మైనారిటీలకు అండగా ఉంటాం
* ఎన్నికలలో ఇచ్చిన వాగ్దానాలు నెరవేరుస్తాం
* ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ
అచ్చంపేట: రాష్ట్రంలో ముస్లింలకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని నాగర్ కర్నూల్ ఎంపీ మల్లురవి, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ భరోసా కల్పించారు. వారి సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోందని చెప్పారు. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటలో రూ. 2 కోట్లతో నిర్మించనున్న ముస్లిం మైనారిటీ కమ్యూనిటీ హాల్ నూతన భవనానికి ఎంపీతో కలిసి భూమి పూజ చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎన్నికల ముందు ముస్లింలకు అండగా ఉంటామని అవసరమున్న, ఆపద ఉన్న వెన్నుదన్నుగా ఉంటానని ముస్లింలకు హామీ ఇవ్వడం జరిగిందన్నారు. అందుకు అనుగుణంగానే ముస్లింల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రజా ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికతో ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. ముస్లింలు పవిత్రంగా భావించే మస్జిద్, దర్గా, ఈద్గాల అభివృద్ధికి తన సహకారం ఎల్లప్పటికీ ఉంటుందన్నారు. గతంలో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి పనులను గుర్తుచేసుకున్నారు.
అచ్చంపేట నియోజకవర్గంలో దర్గాల అభివృద్ధి కోసం నిధులు కేటాయిస్తానని హామీ ఇచ్చారు. మస్జిద్ నిర్మాణ పనులు పెండింగ్ లేకుండా పూర్తి చేయించే బాధ్యత తానే తీసుకుంటానని ముస్లింలకు ఆయన హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లింల సంక్షేమం, అభివృద్ధి కోసం అనేక పథకాలతో ముందుకు పోతుందన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందనీ తెలిపారు. కార్యక్రమంలో ముస్లిం నేతలు పాల్గొన్నారు.




