16-07-2025 12:39:02 AM
మాజీ ఎమ్మెల్యే సతీశ్ కుమార్
హుస్నాబాద్, జూలై 15 : రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు కార్యకర్తలు సిద్ధం కావాలని, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఎండగట్టాలని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడితల సతీశ్ కుమార్ పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికలకు కార్యకర్తలను సమాయత్తం చేసేందుకు మంగళవారం ఆయన హుస్నాబాద్లోని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ ఆఫీసులో అక్కన్నపేట మండల స్థాయి కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు.
గ్రామాల్లో కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం సాధించేలా కృషి చేయాలన్నారు. కేసీఆర్ ప్రభుత్వం హయాంలో జరిగిన అభివృద్ధి పనులను, ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ హయాంలో ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించాలని సూచించారు. ప్రజా సమస్యల పరిష్కరంతోపాటు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైందని,
ఈ విషయాన్ని గ్రామాల్లో చర్చకు పెట్టి ప్రభుత్వ వైఫల్యాలను బలంగా ప్రజలకు తెలియజేయాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కార్యకర్తలు కష్టపడి పని చేయాలని, పార్టీ గెలుపు కోసం శ్రమించిన వారికి తప్పకుండా గుర్తింపు ఉంటుందన్నారు. భారత రాష్ట్ర సమితి పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజలతో మమేకమై వారికి అండగా నిలబడాలని ఆయన పిలుపునిచ్చారు.