ప్రభుత్వ లక్ష్యాలను సాధించాలి
- ఆధునిక సాంకేతికతను వినియోగించుకోవాలి
- అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ
- మంత్రిని కలిసిన అటవీశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ
- శైలజా రామయ్యర్
హైదరాబాద్, జూలై 6 (విజయక్రాంతి) : సీఎం రేవంత్ రెడ్డి ఆశయాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణ, వన మహోత్సవం, వన్యప్రాణులు, జీవవైవిధ్య పరిరక్షణ, అడవుల్లో అగ్ని ప్రమాదాల నివారణ, అడవుల సంరక్షణలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన వినియోగం తదితర కార్యక్రమాలను సమర్థవంతంగా చేపట్టేలా కార్యాచరణను అమలు చేయాలని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. పర్యావరణ, అటవీశాఖల ప్రిన్సిపల్ సెక్రటరీగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన శైలజా రామయ్యర్ మంత్రి సురేఖను జూబ్లీహిల్స్లోని ఆమె నివాసంలో సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా మంత్రి ఆమెకు శుభాకాంక్షలు తెలిపి దిశానిర్దేశం చేశారు. శైలజా రామయ్యర్ నేతృత్వంలో అటవీ, పర్యావరణ శాఖలు మరింత ప్రభావవంతంగా పనిచేసి, ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు. అటవీ, పర్యావరణ శాఖల బలోపేతం దిశగా ప్రణాళికాబద్దంగా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ఈ సందర్భంగా అటవీ, పర్యావరణ శాఖలకు సంబంధించిన పలు అంశాలపై మంత్రి కొండా సురేఖ, ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్ మధ్య సంక్షిప్తంగా చర్చ జరిగింది.






