17-06-2025 12:56:02 AM
-రూ.40 లక్షల బిల్లులు ఇవ్వాలని కాంట్రాక్టర్ డిమాండ్
- లేదంటే ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరింపు
- బయటే నిరీక్షించిన ఉపాధ్యాయులు, విద్యార్థులు
- నిర్మల్ జిల్లా రాజుర గ్రామంలో ఘటన
నిర్మల్, జూన్ 16 (విజయక్రాంతి)/ఖానాపూర్: నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం లోని రాజుర గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలకు కాంట్రాక్టర్ గడ్డం శ్రీనివాస్ సోమవారం తాళం వేశారు. పాఠశాల నిర్మాణానికి సంబంధించిన పెండింగ్లో ఉన్న రూ.40 లక్షల బిల్లులు ఇచ్చేదాక తీయబోనని గేటుకు తాళం వేసి విద్యార్థులను, ఉపాధ్యాయులను లోనికి వెళ్లకుండా అడ్డుకున్నాడు. గడ్డం శ్రీనివాస్ గత ప్రభుత్వ హయాంలో ఎస్ఎంసీ చైర్మన్గా వ్యవహరించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వంలో మన ఊరు బడి కార్యక్రమం కింద రూ.40 లక్షలతో పాఠశాల పూర్తి మరమ్మతులు, ఇతర సౌకర్యాలు కల్పించినట్టు తెలిపారు. ప్రభుత్వం మారిన తర్వాత కాంగ్రెస్ అమ్మ ఒడి పేరుపై నిధులను మార్చి బిల్లులు ఇవ్వడం లేదన్నారు. తన ఆస్తులు, ఎడ్లు, ట్రాక్టర్లు అమ్మి అప్పు తీర్చానని వాపోయారు.
ఇంకా తీర్చాల్సింది ఉందని, వారి వేధింపులు భరించలేకపోతున్నాని చెప్పారు. బిల్లులు ఇవ్వకుంటే ఇక్కడే పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. ఈ విషయమై జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల ఉపాధ్యాయుడు సునీల్రెడ్డిని వివరణ కోరగా.. ఈ విషయం పైఅధికారులకు తెలియజేశామని, వారి నిర్ణయం మేరకు నడుచుకుంటామని చెప్పారు.